జనగామ: చల్లటి బీరు కొనుగోలు చేసిన ఓ వినియోగదారునికి షాక్ తగిలింది. కింగ్ ఫిషర్ బీరులో ఫంగస్ కనిపించడంతో కలకలం చెలరేగింది. జనగామ జిల్లాలో ఈ ఘటన ఇవ్వాల (శుక్రవారం) వెలుగులోకి వచ్చింది. జనగామ టౌన్లోని సంజయ్ నగర్ కి చెందిన ఇద్దరు యువకులు త్రిపుల్ ఎస్ వైన్స్ షాపులో నాలుగు బీర్లు కొనుగోలు చేశారు. వాటిని తాగుతున్న క్రమంలో బీరు బాటిల్లో ఫంగస్ ఉండటాన్ని గమనించారు.
దీంతో వినియోగదారులు షాక్కు గురై సదరు వైన్ షాపు వద్దకు వెళ్లి ఫంగస్ని చూపించి నిలదీశారు. ఇలాంటి బీర్లు ఎలా విక్రయిస్తారని ప్రశ్నించారు. అయితే.. తమకు డిస్టిలరీ కంపెనీ నుంచే అలా వచ్చిందని, తామేం చేస్తాం.. తమకు సంబంధం లేదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో వినియోగదారులు మరింత ఖంగుతిన్నారు. బీరు ఇక్కడ తయారు చేయలేదని, అవసరమైతే కంపెనీ దగ్గరి వెళ్లి నిలదీయాలని షాపు వారు చెప్పడం గమనార్హం. ఈ ఘటనపై ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు వారు తెలిపారు.