Tuesday, April 30, 2024

Khammam: ప్రమాద రహిత సమాజం కోసం డ్రైవింగ్ లైసెన్సులు తప్పనిసరి.. మంత్రి పువ్వాడ

ఖమ్మం : సమాజంలో ప్రతి ఒక్కరూ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలని, ప్రమాద రహిత సమాజం నిర్మించాలంటే డ్రైవింగ్‌ లైసెన్స్‌ తప్పనిసరని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు. ఖమ్మం వి.డి.ఓ.స్‌ కాలనీ మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత డ్రైవింగ్‌ లైసెన్స్‌ మేళాను శుక్రవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ప్రారంభించారు. నేటి నుండి సెప్టెంబర్‌ 23వ తేదీ వరకు నిర్విరామంగా ఈ ప్రక్రియ కొనసాగుతుందని ఖమ్మం నియోజకవర్గ ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి కోరారు. రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు సూచనలతో ఉచిత డ్రైవింగ్‌ లైసెన్స్‌ పంపిణీ ప్రక్రియను ప్రారంభించడం జరిగిందన్నారు. 18సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఈ అవకాశం కల్పించాలని పువ్వాడ ఫౌండేషన్‌ ఆద్వర్యంలో ఉచిత డ్రైవింగ్‌ లైసెన్స్‌ మేళాకు అయ్యే ఖర్చును పువ్వాడ ఫౌండేషన్‌ భరిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.

లైసెన్స్‌ లేకుండా డ్రైవింగ్‌ చేయటం చట్టరీత్యా నేరమని, అజాగ్రత్త వల్ల వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు. సరైన అవగాహన లేకుండా వాహనాలు నడిపితే మనతో పాటు ఎదుట వారి ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేసిన వారం అవుతామన్నారు. నేటి యువతకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ తప్పని సరిగా ఉండాల్సిన హక్కు అని, దాన్ని నిర్లక్ష్యం చేయొద్దని, మనం చేసే చిన్నపాటి తప్పిదం వల్ల ఎన్ని విలువైన ప్రాణాలు బలి అయిపోతాయాని వివరించారు. అందుకే యువతను దృష్టిలో పెట్టుకొని ఖమ్మం నియోజకవర్గంలో అందరికీ ఉచితంగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ అందజేస్తున్నామన్నారు. లైసెన్స్‌ పొందటానికి అవసరమైన ఫీజు తానే చెల్లిస్తానని, ఎవరూ ఒక్క రూపాయి చెల్లించాల్సిన పని లేదని, ఖమ్మం నియోజకవర్గంలో అందరికీ లైసెన్స్‌లు ఉచితంగా అందజేస్తామన్నరు. ముందు లెర్నింగ్‌ లైసెన్స్‌ ఆతరువాత పర్మినెంట్‌ లైసెన్స్‌ అందజేస్తారని, ఇక్కడ స్లాట్‌ బుక్‌ చేసుకున్న అనంతరం రవాణా శాఖ కార్యాలయంలో ఫోటో దిగి, సంతకం చేసి మళ్ళీ మన క్యాంపు కార్యాలయంలో ఆయా లెర్నింగ్‌ లైసెన్స్‌ (ఎల్‌.ఎల్‌.ఆర్‌) పత్రం పొందాలని మంత్రి కోరారు. దీంతో పాటు ఇక్కడే (ఎల్‌ఎల్‌ఆర్‌) పొందిన యువతకు ప్రత్యేక శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తామన్నారు.

డ్రైవింగ్‌ పై పూర్తి అవగాహనతో పాటు ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ పై యువతకు అవగాహన కల్పిస్తామని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ రూల్స్‌, డ్రైవింగ్‌ రూల్స్‌ తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఉందన్నారు. రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మంత్రికి మాత్రమే ఉండే అధికారంతో ఫాన్సీ నంబర్‌ లు కేటాయించే విధంగా ఉండేదని, కానీ ప్రభుత్వంకు వచ్చే ఆదాయంను దృష్టిలో ఉంచుకుని ఫాన్సీ నంబర్‌ ను బెడ్స్‌ ద్వారా నేరుగా ప్రజలకే అందిస్తున్నామని పేర్కొన్నారు. తద్వారా రవాణా శాఖకు గత ఏడాది కేవలం ఫ్యాన్సీ నంబర్‌ ద్వారా రవాణాశాఖ కు 74 కోట్ల ఆదాయం వచ్చిందని, అది ఈ ఏడాది వంద కోట్లు దాటుతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. తాను రవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పారదర్శకంగా రవాణాశాఖలో పనులు జరుగుతున్నాయని, అన్ని సేవలు దాదాపుగా ఆన్లైన్‌ లోనే పోందే వెసులుబాటు కల్పించడం జరిగిందన్నారు. అనంతరం స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారికి, లెర్నింగ్‌ లైసెన్స్‌ పత్రాలు మంత్రి అందజేశారు.ఈకార్యక్రమంలో నగర మేయర్‌ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌ కుమార్‌, అర్‌ టి ఓ కిషన్‌ రావు, జిల్లా అర్‌ టి ఎ మెంబర్‌ వల్లభనేని రామారావు, ఆర్‌.జె.సి కృష్ణ, కార్పొరేటర్‌లు కర్నాటి కృష్ణ, మక్బూల్‌, మందడపు లక్ష్మి, పకాలపాటి విజయ, దండా జ్యోతి రెడ్డి, నాయకులు పగడాల నాగరాజు, తాజుద్దీన్‌, తోట వీరభద్రం, కొల్లు పద్మ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement