Tuesday, May 7, 2024

TS: కుటుంబ పాలనకు మరో అవకాశం ఇవ్వొద్దు: మోడీ

నిజామాబాద్: తెలంగాణ యువత కుటుంబ పాల‌న‌కు మ‌రో అవ‌కాశం ఇవ్వొద్ద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. తెలంగాణలో రూ.8,021 కోట్ల విలువైన పనుల ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రారంభించారు. నిజామాబాద్ నుండి వర్చువల్ గా పలు కార్యక్రమాలను మోడీ ప్రారంభించారు. సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ ను జాతికి అంకితం చేశారు. మనోహరాబాద్-సిద్దిపేట రైల్వేలైన్ ను, 20 క్రిటికల్ కేర్ బ్లాకులను ప్రారంభించారు. ఈసంద‌ర్భంగా జనగర్జన సభలో మోడీ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల సంపదను ఓ కుటుంబం దోచుకుంటోందన్నారు. ఎంతో మంది బలిదానాలతో తెలంగాణ సాకారమైందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కుటుంబ స్వామ్యంగా బీఆర్ఎస్ మార్చిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన ప్రతిఫలాన్ని ఒక కుటుంబమే అనుభవిస్తోందన్నారు. కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే ధనికులయ్యారన్నారు. కాంగ్రెస్‌ పార్టీని దేశమంతా తిరస్కరించిందని మోడీ వ్యాఖ్యానించారు.

త్వరలోనే భారతీయ రైల్వే వందశాతం ఎలక్ట్రిఫికేషన్ పూర్తి కానుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. తెలంగాణ ప్రజల విద్యుత్ అవసరాలు తీర్చేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఎన్టీపీసీతో రాష్ట్ర ప్రజలకు 4 వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని మోడీ చెప్పారు. బీబీనగర్ లో నిర్మిస్తున్న ఎయిమ్స్ భవనాన్ని మీరు చూస్తున్నారని మోడీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ధర్మాబాద్-మనోహరాబాద్-మహబూబ్ నగర్-కర్నూల్ రైల్వే లైన్ విద్యుత్ లైన్ ను పూర్తి చేసుకున్నామని మోడీ చెప్పారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన వైద్య పథకం ఆయుష్మాన్ భారత్ ను అమలు చేస్తున్నామన్నారు. పెద్దపల్లి జిల్లాలో సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు తొలి యూనిట్ ను ప్రారంభించుకున్నట్టుగా మోడీ చెప్పారు. త్వరలోనే రెండో యూనిట్ అందుబాటులోకి వస్తుందని ప్రధాని చెప్పారు. తమ ప్రభుత్వం శంకుస్థాపనలే కాదు.. వాటిని పూర్తి చేస్తుందన్నారు. ఇది తమ వర్క్ కల్చర్ గా ఆయన పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement