Saturday, May 4, 2024

TS : ఆర్టీసీ ఆస్తులు అమ్మే ప్ర‌స‌క్తే లేదు – డిప్యూటీ సిఎం భట్టి ..

ఎట్టి ప‌రిస్థితుల్లో అయినా కాపాడుకుంటాం..
మహాలక్ష్మితో ఆర్టీసీ కళకళ
100 శాతం ఆక్యుపెన్సీతో ముందుకు
22 గ్రీన్ మెట్రో బ‌స్సులు అందుబాటులోకి
ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టితో క‌లిసి బ‌స్సులు ప్రారంభించిన మంత్రి పొన్నం
పాల్గొన్న మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి
మ‌రిన్ని కొత్త బ‌స్సులు తీసుకొస్తామ‌ని వెల్ల‌డి
మ‌హాల‌క్ష్మిలో తొలిసారి నాన్ ఏసీ ఎల‌క్ట్రిక్ బ‌స్సులు

హైదరాబాద్ – ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీసీ ఆస్తులు అమ్మే ప్రసక్తే లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తొలి దశలో 25 ఎలక్ట్రిక్ బస్సులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ఎరియర్ బాండ్స్ చెక్కులను మంత్రులు ఆర్టీసి ఉద్యోగులకు అందించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. టీఎస్ఆర్టీసీకి ప్రభుత్వం సహకారం ఎప్పుడు ఉంటుందని తెలిపారు. గతంలో ఆర్టీసీ సిబ్బంది జీతాల కోసం ఇబ్బంది పడ్డారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం ఉద్యోగులు సమయానికి జీతాలు అందిస్తోందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లోని ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, మహాలక్ష్మీ పథకాలను అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే అమలు చేశామని అన్నారు.

మ‌హాల‌క్ష్మితో క‌ళ‌క‌ళ‌లాడుతున్న బ‌స్సులు..

మహాలక్ష్మి పేరుతో ఆర్టీసీ కళకళలాడుతున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. 100 శాతం ఆక్యుపెన్సీతో ముందుకు వెళ్తున్నదని చెప్పారు. త్వరలోనే నష్టాల నుంచి బయటపడతామని, పాత బకాయిలు కూడా తీర్చుకుంటామని తెలిపారు. హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ మార్గ్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద టీఎస్‌ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ గ్రీన్‌ మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. మహాలక్ష్మిలో మొదటిసారి ఎలక్ట్రిక్‌ నాన్‌ ఏసీ బస్సులు వచ్చాయన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ఆర్టీసీ అంటేనే పేద ప్రజలు ప్రయాణించే బస్సు అని తెలిపారు. ఆర్టీసీ సమస్యలను పరిష్కరించి సంస్థను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని వెల్లడించారు. ఆర్టీసి సిబ్బంది కష్టపడుతున్నారని చెప్పారు. ఇప్పటికే కారుణ్య నియామకాలు చేపట్టామని, త్వరలో మరిన్ని ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు.

రోడ్డెక్కిన గ్రీన్‌ మెట్రో

- Advertisement -

గ్రీన్‌ మెట్రో ఎక్స్‌ప్రెస్‌.. నాన్‌ ఏసీ ఎలక్ర్టిక్‌ బస్సులు మంగళవారం నుంచి రోడ్లపై పరుగులు ప్రారంభించాయి. 22 బస్సులను ఖైరతాబాద్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద మంగళవారం మంత్రులు ప్రారంబించారు. గ్రేటర్‌లో మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల స్థానంలో 500 గ్రీన్‌ మెట్రో ఎక్స్‌ప్రె్‌సలను అందుబాటులోకి తేనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు. నాన్‌ ఏసీ ఎలక్ర్టిక్‌ బస్సులకు ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే 220 కిలోమీటర్లు ప్రయాణించనున్నాయి. డీసీ ఫాస్ట్‌ చార్జింగ్‌ పాయింట్‌తో గంట నుంచి గంటన్నరలో ఎలక్ర్టిక్‌ బస్సులకు పూర్తిస్థాయిలో చార్జింగ్‌ చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈబస్సుల ఆపరేషన్స్‌ మియాపూర్‌, కంటోన్మెంట్‌ డిపోల నుంచి నిర్వహించనున్నారు. ఏసీ ఎలక్ర్టిక్‌ బస్సుల తరహాలో నాన్‌ ఏసీ బస్సుల్లో సీటింగ్‌ ఉండనుంది. ఈ బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నారు.

ఆర్టీసీ కార్మికులకు భావ ప్రకటన స్వేచ్చ ఉండేది కాదన్నారు. రాష్ట్రంలో సింగరేణి, ఆర్టీసీ సంస్థల్లోనే వేల సంఖ్యలో ఉద్యోగులు ఉంటారన్నారు. టీఎస్‌ఆర్టీసీ అభివృద్ధికి ప్రభుత్వ సహాయం అందుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుకుంటుందన్నారు. మహాలక్ష్మిగా కీర్తించే మహిళలు గౌరవంగా బస్సులో ప్రయాణిస్తున్నారన్నారు. మహిళల టికెట్ డబ్బులను ప్రభుత్వమే ఇస్తుందని తెలిపారు. ఒక కార్మికుడిలా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లు, గృహ జ్యోతి, మహాలక్ష్మి పథకాలను మూడు నెలల్లోనే అమలు చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement