Friday, May 3, 2024

పెద్దపల్లి జిల్లాలో దంపతుల హత్య.. పాలోల్లే పగబట్టి చంపేశారు.. కేసు ఛేదించిన పోలీసులు

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలో సంచలనం రేపిన దంపతుల హత్య కేసులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ లో మీడియాతో మాట్లాడుతూ పాలకుర్తి మండలం రామరావుపల్లిలో ఈ నెల 24న మంచినీళ్ల వెంకటి అతని భార్య మంచినీళ్ల కనకమ్మ హత్యకు గురయ్యారన్నారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామన్నారు. మృతుడు వెంకటి అతని సోదరుడు రాజయ్యకు మధ్య కొన్ని సంవత్సరాలుగా భూ తగాదాలు ఉన్నాయన్నారు. కుటుంబం పొత్తులో ఉన్న సమయంలో కొనుగోలు చేసిన భూమి పంపకం విషయంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవలు ఉన్నాయన్నారు.

దంపతుల హత్యకు రెండు రోజుల ముందు వ్యవసాయ భావికి బిగించిన మోటర్ విషయంలో మృతుడు వెంకటితో రాజయ్య కుమారుడు రవితేజకు మధ్య గొడవ జరిగిందన్నారు. ఏళ్ల తరబడి సమస్య పరిష్కారం కాకపోవడంతో రాజయ్య అతని భార్య శాంత, ఇద్దరు కొడుకులు రవితేజ, ప్రవీణ్ వెంకటితో పాటు అతని భార్యను హతమార్చాలని పథకం వేసుకున్నారన్నారు. ఈ నెల 24న మృతులు వెంకటి అతని భార్య కనకమ్మ వ్యవసాయ పనులకోసం పొలం వద్దకు వెళ్లగా పథకం ప్రకారం నిందితుడు రవితేజ గొడ్డలి తీసుకొని పొలం వద్దకు వెళ్లి వెంకటి, అతని భార్య కనకమ్మను దారుణంగా హత్య చేశాడన్నారు. దంపతులను హత్య చేసిన రవితేజతో పాటు అతనికి సహకరించిన రాజయ్య, శాంత, ప్రవీణ్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామన్నారు. ఈ సమావేశంలో బసంత నగర్ ఎస్సై మహేందర్, శివానితో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement