Tuesday, May 14, 2024

పిల్ల‌ల‌కు పోష‌కాహారం అందేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న క‌లెక్ట‌ర్

పిల్ల‌ల‌కు పోష‌కాహారం అందేవిధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఉద‌య్ కుమార్ జిల్లా సంక్షేమ అధికారులను ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం మన్ననూర్ పి.ఓ. ఐ.టి.డీ. ఏ కార్యాలయంలో స్యామ్ మ్యామ్ పిల్లలను సాధారణ స్థితికి తీసుకురావడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఐ.టి.డి.ఏ అధికారి, సి.డి.పి.ఓ లు, సూపర్ వైజర్ లతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో తక్కువ బరువుతో ఉన్న పిల్లలను గుర్తించి సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు సూపర్ వైజ‌ర్ల‌ పర్యవేక్షణతో పాటు సూపర్ వైజ‌రి ఫీడింగ్ ను అంగన్వాడీ టీచర్ల దగ్గరుండి తినిపించే విధంగా తగిన సూచనలు ఇవ్వాలనీ సి.డి.పి.ఓ లను ఆదేశించారు. చెంచుపెంటలు ఏజెన్సీ ఏరియాల్లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా ఇచ్చే పౌష్టికాహారంతో పాటుగా గిరి పోషణ్ అభియాన్ కింద ఆదనంగా పౌష్టికాహారం అందజేయడం జరుగుతుందన్నారు. అటువంటప్పుడు ఏజెన్సీ ప్రాంతాలు చెంచు పెంటల్లో ఏ ఒక్కపిల్లలు తక్కువ బరువుతో ఉండటానికి వీల్లేద‌న్నారు.

స్యామ్ మ్యామ్ పిల్లలకు పౌష్టికాహారం సరైన సమయంలో క‌చ్చితంగా తినిపించే బాధ్యత అంగన్వాడీ టీచర్లు తీసుకోవాలన్నారు. అన్ని అంగన్వాడీ సెంటర్ల వద్ద మునగ చెట్లు పెట్టించాలని, వాటి ఆకులు, కాయలతో పిల్లలకు పెట్టె వంటల్లో ఉపయోగపడతాయని సూచించారు. పిల్లలకు ఆకలి పరీక్ష పెట్టాలని, ఒకవేళ ఈ పరీక్షలో ఫెయిల్ అయితే ఆరోగ్య సమస్యలకై ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్సలు చేయించాల‌న్నారు. అవసరమైన పిల్లలను ఎన్. ఆర్.సి కేంద్రానికి పంపించాలన్నారు. ఐ.టి.డి.ఎ. పి.ఓ. అశోక్ వివరిస్తూ… నాగర్ కర్నూల్ జిల్లాలో గిరిపోషణ్ కింద 85 హాబీటేషన్లు ఉన్నాయ‌న్నారు. ఈ అంగన్వాడీ సెంటర్లకు గిరిపోషణ్ ద్వారా ప్రత్యేక పౌష్టికాహారం ఇవ్వడం జరుగుతుందన్నారు. చిన్న పిల్లలకు, కౌమార దశ పిల్లలకు పౌష్టికాహారం అందజేయడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అచ్ఛంపేట ఆర్.డి.ఓ పాండు నాయక్, పి.ఓ. అశోక్, సి.డి.పి.ఓ లు, అంగన్వాడీ సూపర్వైజర్ లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement