Thursday, May 2, 2024

TS: రైతు నేస్తంకు సీఎం రేవంత్ శ్రీకారం..

హైద‌రాబాద్ – వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతులకు చేదోడు వాదోడుగా డిజిటల్‌ ఫ్లాట్‌ ఫారం రైతు నేస్తం ఉపయోగపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులతో క్షేత్రస్థాయిలో సమస్యలపై రైతులతో చర్చించి వాటికి పరిష్కారం దిశగా సూచనలు ఇస్తారన్నారు. రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్‌ అనుసంధానం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించే వినూత్న కార్యక్రమం ‘రైతు నేస్తం’ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుల‌తో క‌ల‌సి రేవంత్ రెడ్డి, నేడు స‌చివాల‌యంలో ప్రారంభించారు.

2601 రైతు వేదిక‌ల‌లో వీడియో కాన్ఫ్ రెన్స్ స‌దుపాయం….

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ…. దశలవారీగా 3 సంవత్సరాల్లో 2601 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్ల స్థాపన చేయనున్నట్లు చెప్పారు. రూ.97కోట్లతో ఈ ప్రాజెక్టు అమలు చేస్తామన్నారు. మొదటి దశలో 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాట్లు చేస్తున్నామ‌ని, దీని కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.4.07 కోట్లు విడుదల చేసింద‌ని తెలిపారు.

- Advertisement -

ఆన్ లైన్ లోనే రైతుల‌కు సూచ‌న‌లు….

గ్రామాల నుంచే రైతులు ఆన్ లైన్‌లో తమ పంటలకు సంబంధించిన సలహాలు, సూచనలు అందుకోవచ్చన్నారు. తమ అనుభవాలను ఇతర రైతులతో పంచుకోవచ్చని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి మంగళవారం, శుక్రవారం విస్తరణాధికారులు, రైతులతో రైతు నేస్తం కార్యక్రమం అమలవుతుందన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సహకారంతో రాష్ట్ర వ్యవసాయశాఖ రైతులకు భరోసానిచ్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టిందని సీఎం చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement