Friday, May 17, 2024

Leader: ఢిల్లీలోనే సీఎం కేసీఆర్‌.. మూడు రోజుల్లో ఏం చేస్తారంటే..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : మూడురోజుల పర్యటన నిమిత్తం తెలంగాణ సీఎం కేసీఆర్‌ సోమవారం రాత్రి ఢిల్లీ వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. సీఎం వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌, ఎంపీలు జోగినపల్లి సంతోష్‌కుమార్‌, జి.రంజిత్‌రెడ్డి ఉన్నారు. ఇంకా సీఎం వెంట‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, టీఆర్ ఎస్ పార్టీ ప్రధానకార్యదర్శి రావుల శ్రవణ్‌కుమార్‌రెడ్డి, కరీంనగర్‌ మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌ తదితరులున్నారు.

ముఖ్య‌మంత్రికి ఢిల్లీ విమానాశ్రయంలో టీఆర్ ఎస్‌ లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు స్వాగతం పలికారు. రాష్ట్రపతి ఎన్నికలు ముగిసి, పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తరుణంలో సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఈ పర్యటనలో కొత్త రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును మర్యాదపూర్వకంగా కలవనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కేంద్రం ద‌గ్గ‌ర‌ పెండింగులో ఉన్న పోడుభూముల చట్టసవరణ, తెలంగాణలో గిరిజన, మైనారిటీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు ఆమోదం, భద్రాచలం వద్ద తెలంగాణ నుంచి ఏపీలో విలీనం చేసిన అయిదు గ్రామాలను రాష్ట్రానికి తిరిగి ఇప్పించడం తదితర అంశాలను రాష్ట్ర‌ప‌తికి విన్న‌వించే చాన్స్ ఉంద‌ని స‌మాచారం.

ఇక‌.. కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి వరదసాయం, విభజన హామీల అమలుపై కూడా విన‌తి చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. సోమవారం రాత్రి దాకా ఎవరి అపాయింట్‌మెంటూ ఖ‌రారు కాన‌ట్టు ఢిల్లీవ‌ర్గాల నుంచి స‌మాచారం అందుతోంది. అంతేకాకుండా కేంద్రం అప్పుల రూపేణా విధిస్తున్న ఆంక్షలు, పార్లమెంటులో చేసిన ప్రకటనకు సంబంధించి ఆర్థిక నిపుణులతో చర్చించి, కేంద్రాన్ని విమర్శిస్తూ ఆయన మీడియా సమావేశం పెడ‌తార‌ని కూడా మ‌రో ఇంట్రెస్టింగ్ విష‌యం తెలుస్తోంది.

కాగా, పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై పార్టీ ఎంపీలతో భేటీ కానున్నార‌ని, దీంతో పాటు కొత్త జాతీయ పార్టీ, జాతీయ రాజకీయ పరిణామాలపై కూడా పలు పార్టీల‌ నేతలతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్‌ అళ్వాకు మద్దతు కోసం విపక్షాలు ఢిల్లీలో నిర్వహించే సమావేశానికి సీఎం కేసీఆర్‌ను ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్‌ ఆహ్వానించినట్లు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement