Monday, May 6, 2024

ప్ర‌త్యేక ఓట‌రు న‌మోదును స‌ద్వినియోగం చేసుకోవాల‌న్న చంపాలాల్

18 సంవత్సరాలు నిండిన వారందరూ కొత్తగా ఓటరు నమోదు చేసుకునేందుకు, ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు చేసుకోవాలనుకునే ఓటర్లు ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ జిల్లా ఓటర్ జాబితా పరిశీలకులు చంపాలాల్ (ఐఏఎస్) తెలిపారు. ఆదివారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ నిఖిలతో పాటు రెవిన్యూ అధికారులు, వివిధ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ… ప్రతి సంవత్సరం ఓటర్ జాబితాలో సవరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. 01.01.2022 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారిని గుర్తించి ఫారం – 6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేయించాలని ప్రజా ప్రతినిధులను కోరారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీల‌ను, కళాశాల విద్యార్థులను గుర్తించి ఓటరుగా నమోదు చేయించాలన్నారు. జాబితాలో చనిపోయిన వారిని, శాశ్వ‌తంగా వలస వెళ్లిన వారిని గుర్తించి ఫారం -7 ద్వారా వారి పేర్లను జాబితా నుండి తొలిగించేందుకు ప్రజా ప్రతినిధులు కృషి చేయాల‌న్నారు. ఒకే వ్యక్తి వేర్వేరు రెండు పోలింగ్ స్టేషన్లలో ఓటర్ గా నమోదై ఉంటే ఫారం -8 ద్వారా సరి చేసుకోవాలని తెలిపారు. ఈనెల ఒకటి నుండి 30వరకు ఈ ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందన్నారు.

ప్రస్తుత ఓటరు జాబితాపై ఏమైనా అభ్యంతరాలుంటే స్థానిక ఆర్డీఓ, తహసీల్దార్లను సంప్రదించాలని తెలిపారు. అవసరమైతే తనకు ఫోన్ నం. 8247329903కు సంప్రదించాలన్నారు. వికారాబాద్ పట్టణంలోని సంగం లక్ష్మిబాయి ఉన్నత పాఠశాలలో, శివారెడ్డిపేట, నెస్కల్ గ్రామంలో పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటర్ల జాబితాలను పరిశీలించారు. అనంత‌రం బీఎల్ఓలు, అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ సెక్రటరీతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిఖిల, జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, స్వీప్ నోడల్ అధికారి కోటాజి, వికారాబాద్, తాండూరు RDO లు ఉపేందర్ రెడ్డి, అశోక్ కుమార్, తహసీల్దార్లు, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement