Wednesday, May 1, 2024

మ‌హా పుణ్య‌క్షేత్రంలా బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ ఆల‌యం : మంత్రి త‌ల‌సాని

మహా పుణ్యక్షేత్రంను తలపించేలా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయ వద్ద అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద 4.48 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న మల్టి లెవెల్ పార్కింగ్, షాపింగ్ కాంప్లెక్స్ పనులను నియోజకవర్గ అభివృద్ధి నిధులు 6 లక్షల రూపాయలతో ఏర్పాటు చేయనున్న బోర్ వెల్ పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎంతో మహిమ కలిగిన బల్కంపేట ఎల్లమ్మ దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున వస్తారని చెప్పారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు వాహనాలను నిలిపేందుకు ఇబ్బందులు పడుతున్నారని, రోడ్లపై వాహనాలు పార్కింగ్ చేయడం వలన ట్రాఫిక్ స్తంభిస్తుందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని జీ ప్లస్ త్రీ విధానంలో 1165 గజాల విస్తీర్ణంలో పార్కింగ్, షాపింగ్ కాంప్లెక్స్ ను నిర్మిస్తున్నట్లు చెప్పారు. 200 టూ వీలర్ లు, 40 ఫోర్ వీలర్ వాహనాలు పార్కింగ్ చేసే విధంగా డిజైన్ చేసినట్లు వివరించారు. అంతేకాకుండా మొదటి, రెండో అంతస్థుల్లో 24 షాప్స్, ఒక డార్మెటరీ ఈ కాంప్లెక్స్ లో నిర్మిస్తున్నట్లు తెలిపారు. 8 నెలల్లోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. అదే విధంగా ప్రస్తుతం ఆలయం ముందు వివిధ వ్యాపారం నిర్వహించుకుంటున్న వారికి కేటాయించేందుకు పక్కనే ఉన్న ఆలయానికి చెందిన కాంప్లెక్స్ ముందు షాప్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.


హైదరాబాద్ నగరానికి సెంటర్ లో ఉన్న ఎల్లమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు, వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. వారంలో మూడు రోజులు అత్యధికంగా భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తారని, భక్తులు ఇబ్బందులకు గురికాకుండా ట్రాఫిక్ డైవర్షన్ చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఏటా అమ్మవారి కల్యాణాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న విషయం అందరికి తెలిసిందేనన్నారు. అమ్మవారి ఆలయ అభివృద్ధి పనుల్లో భాగస్వాములయ్యేందుకు దాతలు స్వచ్చందంగా ముందుకు వస్తున్నారన్నారు. దాతల సహకారంతో బంగారు చీరను చేయించి అమ్మవారికి అలంకరించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఎస్ఈ మల్లికార్జున్, ఆలయ ఈఓ అన్నపూర్ణ, కార్పొరేటర్ సరళ, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement