Tuesday, May 7, 2024

Big Shock to Congress – కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన మాజీ మంత్రి సంభానితో సహా పలువురు ప్రముఖులు

మాజీ మంత్రి, టీపీసీసీ ముఖ్య నేత సంభాని చంద్రశేఖర్ సహా ఖమ్మం జిల్లా కు చెందిన పలువురు నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య, కొత్తగూడెం, సత్తుపల్లి, వైరా, ఇల్లందు నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ ముఖ్య నేతలు ఎడవల్లి కృష్ణ, కోటూరి మానవతారాయ్, డాక్టర్ రాంచందర్ నాయక్, మడత వెంకట్ గౌడ్ లకు కేసీఆర్ ఎర్రవల్లి లోని తన వ్యవసాయ క్షేత్రంలో గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర దగ్గరుండి మరీ నేతలందరినీ పార్టీలో చేర్పించారు. తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పాటు పడుతున్న బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయడం కోసమే తామంతా పార్టీ లో చేరుతున్నామని వారంతా ప్రకటించారు. పార్టీలో చేరిన నాయకులందరి సేవలు వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా నేతలకు సూచించారు.

అంతకు ముందు వీరందరి నీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రగతిభవన్ కు పిలిపించుకుని పార్టీలోకి ఆహ్వానిస్తూ.. శుభాకాంక్షలు తెలిపారు. వారితో పాటు వచ్చిన ముఖ్య అనుచరులకు కేటీఆర్ స్వయంగా గులాబీ కండువాలు కప్పి, పార్టీలోకి స్వాగతించారు. పార్టీ
లో చేరిన నేతలందరికీ ఎంపీ రవిచంద్ర స్వాగతం పలుకుతూ.. కృతజ్ఞతలు తెలిపారు.

వీరి చేరికకు బీఆర్ఎస్ జిల్లా ముఖ్య నేతలంతా సమిష్టిగా కృషి చేసామని రవిచంద్ర ప్రకటించారు. జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, బండి పార్థసారథి రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, వనమా వెంకటేశ్వరరావు, బానోత్ హరిప్రియా నాయక్ లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement