Friday, May 3, 2024

“బైక్” పై రయ్ రయ్ మంటూ‘‘బండి’’ సుడిగాలి పర్యటన..200 లకు పైగా గణేష్ మండపాల సందర్శన

కరీంనగర్ – బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గత రెండ్రోజులుగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. రెండోరోజైన సోమవారం నాడు కరీంనగర్ లోని పలు కాలనీల్లో స్థానిక బీజేపీ నేతలతో కలిసి పర్యటిస్తూ గణేష్ మండపాలను సందర్శించారు. గణేష్ మండపాలను సందర్శించాలంటూ పెద్ద ఎత్తున యువత వచ్చి కోరడంతో సానుకూలంగా స్పందించిన బండి సంజయ్ గల్లీ గల్లీకి వెళ్లి స్థానిక యువతతోపాటు వివిధ సంఘాలు, వ్యాపార సంఘాల ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను సందర్శించి గణనాథుడికి పూజలు నిర్వహించారు.

గల్లీగల్లీలోకి ఎంపీ వాహనం వెళ్లడం కష్టసాధ్యం కావడానికి తోడు సమయాభావం వల్ల స్థానిక యువత బైక్ లపై ఎక్కి కాపువాడ, గాంధీ రోడ్, బోయివాడ, భగత్ సింగ్ చౌక్, బొమ్మకల్, క్రిష్ణా నగర్, ప్రియదర్శిని నగర్, మారుతి నగర్, కిసాన నగర్ చౌరస్తా ఏరియాలో పర్యటించారు. ఆయా బస్తీలు, కాలనీల్లోని గల్లీగల్లీకి తిరుగుతూ గణేష్ మండపాల వద్దకు వెళ్లి గణనాథుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున యువత బండి సంజయ్ వెంట రాగా వారితో కలిసి కలియ తిరిగారు. ఉదయం ప్రారంభమైన గణేష్ మండపాల సందర్శన రాత్రి పొద్దుపోయే వరకు కొన సాగనుంది. సాయంత్రం 6 గంటల సమయానికి దాదాపు 200కు పైగా గణేష్ మండపాలను బండి సంజయ్ సందర్శించారు. ఒకవైపు గణనాథులను దర్శించుకుంటూనే మరోవైపు యువతతో కలిసి సెల్ఫీలు దిగుతూ… స్థానికుల సమస్యలు వింటూ.. వాటి పరిష్కారానికి భరోసానిస్తూ ముందుకు సాగారు. రాత్రి పొద్దు పోయే వరకు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని వివిధ వార్డుల్లో బండి సంజయ్ పర్యటనను కొనసాగించేలా ఈరోజు షెడ్యూల్ రూపొందించారు.

ఈరోజు సాయంత్రం 6 గంటల సమయానికి 10 డివిజన్లలో సుడిగాలి పర్యటన చేసిన బండి సంజయ్ రాత్రి పొద్దు పోయే వరకు మరో 6 డివిజన్లలో పర్యటించి మరో వంద గణేష్ మండపాలను సందర్శించేలా షెడ్యూల్ రూపొందించడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement