Monday, May 6, 2024

Atchmpet – ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ మాన‌వ‌త్వం… అత్య‌వ‌స‌ర స‌ర్జ‌రీతో గ‌ర్బిణీకి సుఖ ప్ర‌స‌వం..

అచ్చంపేట – శస్త్రచికిత్స నిపుణుడైన నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ శుక్రవారం పురిటినొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణికి ప్రసవం చేశారు. లింగాల మండల కేంద్రానికి చెందిన తొమ్మిది నెలల గర్భిణి ప్రసన్నకు పురిటి నొప్పులు అధికం కావడంతో కుటుంబసభ్యులు 108లో అచ్చంపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. స్కానింగ్‌ చేయగా గర్భంలోని శిశువు మెడకు పేగు చుట్టుకుందని తేలింది. ఆసుపత్రిలో గైనకాలజిస్టు ఉన్నప్పటికీ హైరిస్కు కావడంతో జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆసుపత్రికి తీసుకెళ్లాలని మత్తు వైద్యుడు, సూపరింటెండెంట్‌ డా.ప్రభు సూచించారు. ఆర్థిక స్తోమత లేకపోవడం, గర్భిణిని తరలించేలోపు అనుకోనిదేమైనా జరుగుతుందన్న భయంతో ఆమె కుటుంబసభ్యులు ఎమ్మెల్యే డా.వంశీకృష్ణకు ఫోన్‌ చేసి విషయం తెలిపారు.

ఉప్పునుంతల పర్యటన నుంచి తిరిగివస్తున్న ఎమ్మెల్యే.. ఆందోళన చెందవద్దని వారికి భరోసా ఇచ్చారు. సిజేరియన్‌కు ఏర్పాట్లు చేయాలని అచ్చంపేట ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.ప్రభును ఆదేశించారు. హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు.
డా.ప్రభు, గైనకాలజిస్టు డా.స్రవంతితో కలిసి గర్భిణికి సిజేరియన్‌ చేశారు. ఆడ శిశువు జన్మించింది. తల్లీబిడ్డల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ప్రభుత్వాసుపత్రికి వచ్చి స్వయంగా ప్రసవం చేసినందుకు ఆయనకు కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement