Monday, April 29, 2024

Assembly – విద్యుత్ పై అక్బరుద్దీన్, రేవంత్ మ‌ధ్య మాట‌ల యుద్ధం…

హైద‌రాబాద్ – తెలంగాణ శాసన సభలో విద్యుత్‌పై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మజ్లిస్ పార్టీ నేత అక్బరుద్దీన్ ఒవైసీ మధ్య వాగ్యుద్ధం నడిచింది. అక్బరుద్దీన్ మాట్లాడుతూ…బీఆర్ఎస్ హయాంలో పాతబస్తీ అభివృద్ధి చెందిందని ఒవైసీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. తాము కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణంగా సపోర్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ ముందుందని, దేశ సగటు కంటే ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించారు.

ఈ ద‌శ‌లోనే సీఎం రేవంత్ రెడ్డి ఏబీవీపీ, టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్, ఆరెస్సెస్ అంటూ విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తాను మజ్లిస్ గురించి మాట్లాడాలంటే చాలా మాట్లాడుతానన్నారు. నాదెండ్ల.. ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ఆర్, కిరణ్ కుమార్ రెడ్డి, నిన్నటి వరకు కేసీఆర్ ఇలా అందరితో దోస్తీ చేశారని గుర్తు చేశారు. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో చర్చిద్దామంటే సిద్ధమని, మజ్లిస్ ఎక్కడి నుంచి వచ్చిందో చర్చిద్దాం రండి అన్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్, మజ్లిస్ పార్టీలు కలిసి పని చేశాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్‌ అర్బన్‌లో షబ్బీర్ అలీని, జూబ్లీహిల్స్‌లో అజారుద్దీన్‌ను ఓడించేందుకు కేసీఆర్‌తో కలిసి మజ్లిస్ పని చేసిందని విమర్శించారు. అదే మజ్లిస్ పార్టీ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలలో ఎందుకు పోటీ చేయలేదు? అని నిలదీశారు. కానీ తమ పార్టీ కాంగ్రెస్ మైనార్టీ ముఖ్యమంత్రులను, మైనార్టీ రాష్ట్రపతులను చేసిందని వ్యాఖ్యానించారు. మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలిపారు.

అక్బరుద్దీన్.. కేసీఆర్‌కు మిత్రుడు కావొచ్చు… మోదీకి మద్దతివ్వవచ్చు.. అది వాళ్ళిష్టం.. కానీ తమకు పాత బస్తీ, కొత్త బస్తీ అనే తేడాలు లేవన్నారు. పాతబస్తీని అభివృద్ధి చేస్తామన్నారు. మజ్లిస్, బీఆర్ఎస్ మిత్రపక్షాలు అని కేసీఆర్ పలుమార్లు చెప్పారని గుర్తు చేశారు. అక్బరుద్దీన్ ఎంతసేపు మాట్లాడినా ఇబ్బంది లేదని, ఆయన ఆరుసార్లు గెలిచారని, అందుకే ప్రొటెం స్పీకర్‌గా అవకాశం ఇచ్చామని రేవంత్ రెడ్డి చెప్పారు. మజ్లిస్ పార్టీ కేసీఆర్‌ను రక్షించేందుకు ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కోసమేమో… కరెంట్ కోసం ఆందోళనలు జరగడం లేదని చెబుతున్నారని విమర్శించారు. అక్బరుద్దీన్ ముస్లింలందరికీ నాయకుడు కాదని ఆయన కేవలం మజ్లిస్ పార్టీకి మాత్రమే నాయకుడని చురక అంటించారు.

అక్బరుద్దీన్ అన్ని విషయాలు చెబుతున్నారు కానీ పాతబస్తీలో విద్యుత్ బకాయిలు చెల్లింపులు జరిగేలా చూసే బాధ్యత తనది అని మాత్రం చెప్పడం లేదని రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. విద్యుత్ మొండి బకాయిల్లో సిద్దిపేట, గజ్వేల్ టాప్‌లో ఉన్నాయన్నారు. శ్రీశైలం ఎడమ కాలువ సొరంగం బ్లాస్ట్ అయి ఎనిమిది మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అందులో ఫాతిమా అనే ముస్లిం ఉంటే మజ్లిస్ పార్టీ కనీసం ఆమె గురించి మాట్లాడలేదన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా మజ్లిస్ సభ్యులు వెల్‌లోకి దూసుకు వచ్చే ప్రయత్నం చేశారు. దీనిపై స్పీక‌ర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతో వెన‌క్కి త‌గ్గారు.

- Advertisement -

మేం ఎవరికీ భయపడం… అక్బరుద్దీన్

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై అక్బరుద్దీన్ తీవ్రంగా స్పందించారు. తాము ఎవరికీ భయపడబోమని, కిరణ్ కుమార్ రెడ్డి జైల్లో పెట్టినా భయపడలేదన్నారు. కాంగ్రెస్ తమను అణచివేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పాతబస్తీలో విద్యుత్ చౌర్యం అంటున్నారా? విద్యుత్ బకాయిలు అంటున్నారా? చెప్పాలన్నారు. ఇక తమను ఆయా చోట్ల పోటీ చేయలేదని ఆయన ప్రశ్నిస్తున్నారని, ఎక్కడ పోటీ చేయాలనేది తమ ఇష్టమన్నారు. షబ్బీర్ అలీని ఓడించేందుకు ప్రయత్నించామని చెబుతున్నారని, తాము నిజామాబాద్ అర్బన్‌లో పోటీయే చేయలేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement