Thursday, April 25, 2024

ప్రజా సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం – ఎమ్మెల్యే అరూరి

పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారని వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ తెలిపారు. హన్మకొండ, కాజీపేట మండలాలలోని పరిధిలోని 57మంది లబ్ధిదారులకు జీవో 58ద్వారా మంజూరు అయిన ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ పట్టాలను హంటర్ రోడ్డులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం హన్మకొండ మండలానికి చెందిన 6గురు కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు 6లక్షల 696రూపాయల విలువగల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మేలు చేసేందుకు తీసుకొచ్చిన జీవో నెంబ‌ర్ 58 ద్వారా అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు అందజేస్తోందని తెలిపారు. పేదలకు పూర్తి స్థాయిలో న్యాయం జరగాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన జీవో 58ద్వారా నిరుపేదలు ప్రభుత్వ స్థలాల్లో తాత్కాలికంగా ఎర్పాటు చేసుకున్న నివాసాలకు శాశ్వత పట్టాలను అందజేసీ నిరుపేదల సొంత ఇంటి కలలను నిజం చేస్తున్న ఘనత సీఎం కే దక్కుతుందని పేర్కొన్నారు. గత కాంగ్రెస్‌, తెలుగు దేశం ప్రభుత్వాల ఉన్న సమయంలో జేసీబీలు, ప్రొక్లయిన్‌లతో కూలగొట్టే ప్రయత్నం చేయడంతో పేదలు భయం నీడలో బ్రతికేటట్టు చేసిన పరిస్థితులు ఆ రోజుల్లో ఉండేవి. కానీ, అలాంటి పేదలను గుండెలకు హత్తుకొని ఇవాళ వారికి పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్నదని వివరించారు. ప్రజా సంక్షేమమే ద్యేయంగా కృషి చేసున్న సీఎం కేసీఆర్ కి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement