Thursday, May 2, 2024

TS: సంగంబండ ద్వారా మరో 25వేల ఎకరాలకు సాగునీరు.. భట్టి విక్రమార్క

మక్తల్, మార్చి13 (ప్రభ న్యూస్) : బీమా ప్రాజెక్టులో అంతర్భాగమైన సంగంబండ రిజర్వాయర్ ద్వారా లెఫ్ట్ లో లెవెల్ కెనాల్ ద్వారా అదనంగా మరో 25వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందిస్తామ‌ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సంగంబండ రిజర్వాయర్ వద్ద బండ తొలగింపు పనులను ఇవాళ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి ప్రారంభించారు. అనంతరం మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అధ్యక్షతన జరిగిన మక్తల్ ప్రజా దీవెన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ… బీఆర్ఎస్ పాలకులు చిన్న బండను తొలగించని కారణంగా 25వేల ఎకరాల రైతులు పదేళ్లపాటు తమ భూములను బీడు భూములుగా ఉంచుకున్నారన్నారు. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జలయజ్ఞంలో భాగంగా సంగంబండ రిజర్వాయర్ ను ప్రారంభించడం జరిగిందన్నారు.


ఎంతో ముందు చూపుతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరందుతుంద‌న్నారు. బీఆర్ఎస్ పాలకుల నిర్లక్ష్యం వల్ల పదేళ్లపాటు రైతులు ఎంతగానో నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాపాలన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని అందులో రైతులకు అత్యంత ప్రాధాన్యమిస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తుందన్నారు. అదేవిధంగా అన్నివర్గాల ప్రజల సంక్షేమానికి పాటుపడుతామని చెప్పారు. ముంపు గ్రామాల సమస్యలన్నింటిని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జీఎంఆర్, జడ్పీ చైర్మన్ కె.వనజ ఆంజనేయులు గౌడ్, డీసీసీ అధ్యక్షులు కె.ప్రశాంత్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గవినోళ్ళ బాలకృష్ణ రెడ్డి, జి.గోపాల్ రెడ్డి, పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి, నాగరాజు గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి, గడ్డంపల్లి హనుమంతు, జి.లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement