Saturday, May 4, 2024

అంబేద్క‌ర్ 125అడుగుల భారీ విగ్ర‌హం.. వీడియో రిలీజ్ చేసిన స‌ర్కార్

తెలంగాణ ప్ర‌భుత్వం భార‌త రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ 125అడుగుల భారీ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు స‌ర్వం సిద్ధం చేసింది. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ విగ్రహావిష్కరణ జరగనుంది. హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ తీరంలో ఎన్టీఆర్ గార్డెన్ కు ఆనుకుని ఉన్న స్థలంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దేశంలో ఇప్పటి వరకు ఉన్న అంబేద్కర్ విగ్రహాల్లో ఇదే ఎత్తైనది. పార్లమెంటు ఆకారంలో 50 అడుగుల పీఠాన్ని నిర్మించి, దాని పైన అంబేద్కర్ లోహ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్, బీఆర్ఎస్ ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. అన్ని ప్రాంతాల ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా రవాణా శాఖ ఏర్పాట్లు చేసింది.

దాదాపు 750 బస్సులను వివిధ ప్రాంతాలకు పంపుతోంది. 50 వేల మంది ఆసీనులయ్యేలా విగ్రహం ప్రాంగణంలో ఏర్పాట్లు చేశారు. ఈ విగ్రహం తయారీకి రూ. 146.50 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. మొత్తం 11.80 ఎకరాల స్థలాన్ని దీనికోసం కేటాయించారు. విగ్రహం కింద ఉన్న పీఠంలో 27,556 చదరపు అడుగుల స్థలం ఉంది. ఇందులో అంబేద్కర్ మ్యూజియం, ఆయన జీవితానికి సంబంధించిన ఫొటో గ్యాలరీని ఏర్పాటు చేయనున్నారు. గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం రూ. 10 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రెండు లక్షల మంచి నీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, 80 వేల స్వీట్ ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నారు. విగ్రహావిష్కరణ సందర్భంగా 20 మంది బౌద్ధ గురువులు ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపిస్తారు. దేశంలో ఇప్పటివరకూ ఉన్న అంబేడ్కర్‌ విగ్రహాల్లోకెల్లా ఎత్తయినదిగా ఖ్యాతి గడించబోతోంది. ఈ నెల 14న అంబేడ్కర్‌ 132వ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్‌ మనవడు ప్రకాష్‌ అంబేడ్కర్‌, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను రిలీజ చేసింది కేసీఆర్ ప్ర‌భుత్వం.

Advertisement

తాజా వార్తలు

Advertisement