Monday, April 29, 2024

KTR: కార్యకర్తలే కథానాయకులు… కేటీఆర్

బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే కథానాయకులని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జనవరి 3 ఆదిలాబాద్ తో ప్రారంభమైన సమావేశాలు నేడు నల్లగొండతో ముగుస్తున్నాయి. నేటితో మొత్తం 17 లోక్ సభ నియోజకవర్గాల సమావేశాలు పూర్తవుతున్నాయి. నల్లగొండ లోక్ సభ నియోజక వర్గ సన్నాహాక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ…. కార్యకర్తల వల్లే ఇన్నేళ్ళుగా పార్టీ బలంగా ఉందన్నారు. గత 16 సమావేశాల తీరు చూస్తే కార్యకర్తలే పార్టీకి ధైర్యం చెప్పారన్నారు. నల్లగొండలో ఎన్నికల ప్రచార సరళి మనకు అనుకూలంగా ఉన్నట్టే అనిపించిందన్నారు. ఎక్కడా ఓటమిపై అనుమానాలు రాలేదన్నారు.

ఎన్నికల ఫలితాలు మరోలా వచ్చాయన్నారు. సూర్యాపేటలో మాత్రమే గెలిచామన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి సమన్వయం లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురైందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారని తెలిపారు. ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి.. ఈ పార్లమెంటు సన్నాహాక సమావేశాలు ఆరంభం మాత్రమే అన్నారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలు మొదలవుతాయన్నారు. సోషల్ మీడియాలో జరిగిన అసత్య ప్రచారాన్ని మనం గట్టిగా తిప్పికొట్టలేకపోయామన్నారు. అవతలి వాళ్లు అభూత కల్పనలు, అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టించారన్నారు. మనం ఇంకా మాట్లాడటం మొదలు పెట్టనే లేదు.. కాంగ్రెస్ వాళ్ళు ఉలికి పడుతున్నారన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఇంకెలా ఉంటుందో ఉహించుకోండని కేటీఆర్ అన్నారు.

అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ వాళ్లు కూడా కలగన లేదన్నారు. అందుకే ఇష్టమొచ్చినట్టు హామీలు గుప్పించారన్నారు. హామీలకు కాంగ్రెస్ పంగనామాలు పెట్టే ప్రయత్నం చేస్తోoదని.. అయినా వదిలి పెట్టమన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు రేవంత్ రెడ్డి అడ్డమైన మాటలు చెప్పారన్నారు. కార్యకర్తలు ఉదాసీన వైఖరి మీమాంస వీడాలి.. ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఏం మాట్లాడారు. ఇపుడేం చేస్తున్నారో ప్రజలకు విడమరచి చెప్పాలన్నారు. కోమటిరెడ్డి గత నవంబర్ లోనే కరెంటు బిల్లులు కట్టవద్దని చెప్పారు.. నల్లగొండ ప్రజలు బిల్లులు కట్టకుండా కోమటి రెడ్డికే పంపండన్నారు. సాగర్ ఆయకట్టుకు కాంగ్రెస్ పాలన లో మొదటి సారి క్రాప్ హాలీడే ప్రకటించే దుస్థితి దాపురించిందన్నారు. కృష్ణా రివర్ బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించి తెలంగాణ జుట్టును కాంగ్రెస్ కేంద్రం చేతిలో పెడుతోందన్నారు. శ్రీ రామ్ సాగర్ చివరి ఆయకట్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఎండ బెడుతోందన్నారు.

- Advertisement -

కరెంటు కోతలు అప్పుడే మొదలయ్యాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ అక్రమ బంధం నల్లగొండ మున్సిపాలిటీ అవిశ్వాసంలో బయట పడిందన్నారు. రేవంత్ భుజం మీద తుపాకీ పెట్టి మోడీ బీఆర్ఎస్ ను కాలుస్తారట.. మైనారిటీ సోదరులకు కాంగ్రెస్ బీజేపీ అక్రమ సంబంధం గురించి చెప్పాలన్నారు. రాహుల్ అదానీని దొంగ అన్నారు.. రేవంత్ దొర అంటున్నాడన్నారు. కేసీఆర్ పై ప్రజల్లో సానుభూతి వెల్లువలా ఉంది.. ఈ పరిస్థితిని పార్లమెంటు ఎన్నికల్లో సానుకూలంగా మలచుకోవాలన్నారు. కాంగ్రెస్ కు ఇప్పటికే అనేక వర్గాలు దూరమయ్యాయన్నారు. నల్లగొండ పార్లమెంటు ఎన్నికల్లో సమష్టి గా పనిచేసి గెలుద్దామన్నారు.

ఈ సమావేశంలో మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, నల్లగొండ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మున్సిపల్‌ చైర్మన్లు, మాజీ మున్సిపల్‌ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement