Thursday, April 25, 2024

TS : బండి సంజ‌య్ పై కేసు న‌మోదు…

ఆంక్ష‌లున్నా చెంగిచ‌ర్ల‌కు వ‌చ్చిన బండి
పోలీసుల బారీకేడ్స్ తొల‌గించి బ‌స్తీలోకి ఎంట్రీ
ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఉద్రిక్త‌త వాత‌వ‌ర‌ణం
బండితో పాటు మ‌రో 9మందిపై కేసు న‌మోదు

చెంగిచ‌ర్ల – బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌పై కేసు నమోదైంది. ఈనెల 27న చెంగిచర్లలో జరిగిన ఘటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన బండి సంజయ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి ఫిర్యాదు మేరకు బండి సంజయ్‌తో పాటు మరో 9మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక్క‌డ ఒక ఘ‌ట‌న‌లో గాయపడిన మహిళలను పరామర్శించేందుకు బండి సంజయ్ నిన్న చెంగిచర్లలోని పిట్టలబస్తీకి వెళ్లారు. బండి సంజయ్ రావడంతో పెద్దఎత్తున కార్యకర్తలు, అభిమానులు గుమిగూడడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అనుమతి లేదంటూ తెలిపారు. ఎవరూ లోనికి అనుమతించకుండా పోలీసులు బారికేడ్లను ఏర్పాట్లు చేశారు.

దీంతో అక్కడకు చేరుకున్న బండిసంజయ్, ప్రజలు, అభిమానులు పోలీసులు ఏర్పాటు చేసిన భారీ కేడ్లను తోసుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. బస్తీలో మోహరించిన పోలీసుల కంటే బీజేపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో రావడంతో వారు బారికేడ్లను బద్దలుకొట్టి కాలనీలోకి ప్రవేశించారు. ఈ ఘటనలో గాయపడిన మహిళలతో సంజయ్ మాట్లాడి, వారికి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలీసులు కబేళా నిర్వాహకులకు కక్ష కట్టి పేద గిరిజన మహిళలపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. కార్మికులు బస్తీకి వచ్చి మహిళలు, పిల్లలపై దాడి చేశారని, కాబట్టి మహిళలపై కాకుండా వారిపై కేసులు నమోదు చేయాలి’ అని డిమాండ్ చేశారు.. ఈ నేప‌థ్యంలో పోలీస్ విధుల‌కు ఆటంకం క‌లిగించ‌డ‌మే కాకుండా, అనుమ‌తి లేకుండా బ‌స్తీలోకి ప్ర‌వేశించార‌నే కార‌ణంతో బండిపై కేసు న‌మోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement