Tuesday, April 30, 2024

ఎంబీబీఎస్ బి-కేటగిరీ సీట్లల్లో.. 85 శాతం తెలంగాణ విద్యార్థులకే

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్వరాష్ట్రంలో డాక్టర్‌ చదవాలనుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మైనారిటీ, నాన్‌ మైనారిటీ మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌-బి కేటగిరీ సీట్లలో కేటాయించే 35 శాతం సీట్లలో 85 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కేలా అడ్మిషన్ల నిబంధనలను సవరిస్తూ తెలంగాణ వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు గురువారం జీఓ నెంబర్‌ 129, 130లను ప్రభుత్వ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలోని మొత్తం 24 ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లోని 1,068 ఎంబీబీఎస్‌ సీట్లు అదనంగా తెలంగాణ విద్యార్థులకే లభించనున్నాయి.
తెలంగాణలో 20 నాన్‌ మైనారిటీ, 4 నాన్‌మైనారిటీ ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో మొత్తం 3750 సీట్లు అందుబాటులో ఉన్నాయి. నాన్‌ మైనారిటీ కాలేజీల్లో 3200 సీట్లు ఉండగా ఇందులో బీ-కేటగిరీ కింద 35 శాతం అంటే 1120 సీట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు వీటికి అన్ని రాష్ట్రాల విద్యార్థులు అర్హులుగా ఉన్నారు. తాజా సవరణ మేరకు బి-కేటగిరీలో ఉన్న 35 శాతం సీట్లలో 85 శాతం సీట్లు అంటే 952 సీట్లు ప్రత్యేకంగా తెలంగాణ విద్యార్థుల కోసం కేటాయిస్తారు. మిగతా 15 శాతం(168) సీట్లు మాత్రమే ఓపెన్‌ కోటాలో ఇతర రాష్ట్ర విద్యార్థులు పోటీపడతారు. ఓపెన్‌ కోటా కాబట్టి ఇందులో తెలంగాణ విద్యార్థులకు కూడా అవకాశం ఉంటుంది. ఇదే విదంగా మైనార్టీ కాలేజీల్లో 25 శాతం బి కేటగిరి కింద ఇప్పటి వరకు 137 సీట్లు ఉన్నాయి. తాజా సవరణతో ఇందులోనూ 85 శాతం అంటే 116 సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయి.

లోకల్‌ రిజర్వేషన్లు లేక అన్యాయం…

ఇప్పటి వరకు రాష్ట్రంలో మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లలో తెలంగాణ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఎలాంటి రిజర్వేషన్‌ లేదు. బి-కేటిగిరీలో ఉన్న 35 శాతం కోటాలో ఎంలాంటి లోకల్‌ రిజర్వేషన్లు అమలు చేయకపోవడంతో ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా ఇక్కడి కాలేజీల్లో ఎంబీబీఎస్‌ సీట్లు సొంతం చేసుకుంటున్నారు. దాంతో తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించిన వైద్యారోగ్యశాఖ మంత్రి ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానంపై అధ్యనం చేసి రిపోర్ట్‌ ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు.

ఆ రాష్ట్రాల్లో ఓపెన్‌ కోటా విధానంలేదు…

- Advertisement -

మహారాష్ట్ర, గుజరాత్‌, కేరళ, ఒడిషా, మధ్యప్రదేశ్‌, జమ్ము కాశ్మీర్‌, పంజాబ్‌ తదితర రాష్ట్రాల్లో ఓపెన్‌ కోటా విధానమే లేదు. గతేడాది నుండి అన్ని సీట్లు ఆయా రాష్ట్రాల విద్యార్థులకే దక్కేలా అక్కడి నిబంధనల్లో మార్పులు చేశారు. దీంతో ఒకవైపు రిజర్వేషన్‌ లేక సొంత రాష్ట్రంలో, మరోవైపు అవకాశం లేక ఇతర రాష్ట్రాల్లోని సీటు పొందలేక తెలంగాణ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీన్ని గుర్తించి అధ్యయనం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి విద్యార్థులకు లాభం చేకూరేలా తాజా నిర్ణయం తీసుకుంది. దీంతో 1068 మంది విద్యార్తులు ఈమేరకు లబ్ధిపొందనున్నారు. ఎంబీబీఎస్‌ విద్య కోసం ఇతర రాష్ట్రాలు సహా ఉక్రెయిన్‌, చైనా, రష్యా వంటి దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్వరాష్ట్రంలోనే డాక్టర్‌ చదివేందుకు అవకాశాలు లభించనున్నాయి.

విదేశాలకు వెళ్లకుండా…

రాష్ట్రంలో జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ప్రారంభించి వైద్య విద్యను పటిష్టం చేస్తున్న క్రమంలో ప్రైవేట్‌ కాలేజీల్లోనూ ఇక్కడ విద్యార్థులకే ఎక్కువ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే బి-కేటగిరీ సీట్లలో లోకల్‌ రిజర్వేషన్‌ 85 శాతంకు పెంచి తెలంగాణ విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంది. డాక్టర్‌ కావాలనే కలను రాష్ట్రంలోనే ఉండి చదివి సాకారం చేసుకోవానుకే ఎంతో మంది విద్యార్థులకు గొప్ప అవకాశం లభించనుంది. విదేశాలకు వెళ్లకుండా ఇక్కడే ఉండి చదివే అవకాశాన్ని మన విద్యార్థులు ఇక పొందనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement