Wednesday, May 1, 2024

YS Sharmila: చేనేత మంత్రి ఇలాఖాలో చావు కేకలు.. ట్విట్టర్ లో చిన్నదొర బిజీ!

మంత్రి కేటీఆర్ పై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. చిన్నదొర గారి సొంత నియోజకవర్గంలో అప్పులపాలైన రైతు ఆత్మహత్య చేసుకుండని అన్నారు. చేనేత మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అప్పులపాలై చేనేత కుటుంబం ఆత్మహత్య చేసుకుందని చెప్పారు.  కేటీఆర్ ఆదుకోవాల్సింది పోయి గత్తర రాజకీయాలు, ట్విట్టర్ యుద్ధాలు చేస్తున్నారని మండిపడ్డారు.

తప్పితే అయ్యో అనడానికి నోరు మెదపటం లేదన్నారు. సాయమందించటానికి చెయ్యి రావటం లేదని ఫైర్ అయ్యారు. పంట పెట్టుబడికి అప్పు తెచ్చి,సాగు నీటికోసం బోర్ల మీద బోర్లు వేసి చుక్క నీళ్లు పడక,కండ్లనుంచి నీటి ధార ఆగక తెచ్చిన అప్పులు తీర్చలేక గోవర్ధన్ ఆత్మహత్య చేసుకొని చనిపోతే, చేనేత మగ్గం నడువక, బతుకు బండి సాగక బిడ్డ పెళ్లికి చేసిన అప్పు తీర్చలేక చేనేత కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. రాష్ట్రంలో రైతులకు వ్యవసాయం భారమైపోయిందని, నేతన్నల కష్టానికి ఫలితం కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకోని పెద్ద దొర, చిన్న దొర దేశాన్ని ఏలపోవడానికి తెలంగాణ బిడ్డలను గాలికొదిలేస్తున్నారని షర్మిల మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement