Monday, April 29, 2024

బీచ్​లో కారు బీభత్సం.. మహిళ మృతి.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు..

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో  దారుణం జరిగింది. చించాని బీచ్‌లో ఫుడ్‌స్టాల్‌లోకి కారు దూసుకురావడంతో ఓ మహిళ అక్కడికక్కడే చనిపోయింది. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. నిన్న చీకటిపడ్డాకి  ఈ ఘటన జరగ్గా, కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.  నిన్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా సెలవు ఉండడంతో సాయంత్రం తారాపూర్‌లోని చించని బీచ్‌కి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అయితే, అక్కడ బాగా జనం ఉన్నప్పటికీ ఒక కారు బీచ్‌లోకి వేగంగా దూసుకొచ్చంది. కాగా, అక్కడ ఉన్న స్కూటర్‌పైకి దూసుకెళ్లకుండా చేసే ప్రయత్నంలో  నియంత్రణ కోల్పోయాడు కారు డ్రైవర్​. ఆ కారు బీచ్​లో తిరగబడడమే కాకుండా ఫుడ్​ స్టాల్​లోకి దూసుకెళ్లింది.

దీంతో స్టాల్‌లో భోజనం చేస్తున్న మహిళ కారు తాకిడికి అక్కడికక్కడే చనిపోయింది.  మరో ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించగా వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఘటన తర్వాత బీచ్‌లో ఉన్న పలువురు వ్యక్తులు కారు అద్దాలను బద్దలుకొట్టడమే చేయడమే కాకుండా రెచ్చిపోయి కొన్ని ఫుడ్ స్టాల్స్‌ను కూడా ధ్వంసం చేశారు. కుర్చీలు విసిరేసి వీరంగం సృష్టించారు. సుమారు గంటపాటు ఈ విధ్వంసం కొనసాగింది. ఘటనపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. అప్రమత్తమైన వాన్గావ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దుండగుల ఆగ్రహానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కారు డ్రైవర్‌పై ర్యాష్ డ్రైవింగ్ చేయడంపై వంగావ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement