Wednesday, April 17, 2024

హుజూరాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థిగా ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్?

హుజురాబాద్ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార టీఆర్ఎస్.. బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌కు బలమైన అభ్యర్థి దొరికాడని రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ఐఏఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇప్పటివరకూ హుజురాబాద్ నుంచి ఈటలకు పోటీగా ధీటైన అభ్యర్థిని నిలబెట్టేందుకు టీఆర్‌ఎస్ చాలా ప్రయత్నాలు చేసింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్ రెడ్డికి ఖరారు అయినట్లు ప్రచారం జరిగింది. అయితే, దళిత వర్గాల ఓట్లు కూడా ప్రభావం చూపించే స్థాయిలో ఉండటంతో అక్కడ ముందుగా మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేరు తెరపైకి వచ్చింది. కానీ, సోమవారం రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీనియర్ ఐపీఎస్, తెలంగాణ గురుకులాల కార్యదర్శిగా పనిచేస్తున్న ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయం ఒక విధంగా సంచలనం అయితే.. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయనే టీఆర్‌ఎస్ అభ్యర్థి అనేది మరో సంచలనంగా మారింది.

సోషల్ వెల్ఫేర్ గురుకులాల కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ కుమార్, స్వేరో అధినేత పేరు దళిత వర్గాలన్నీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చారనే ప్రచారం సైతం ఉంది. అంతేగాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆయన ఎస్పీగా పనిచేశారు. ఆ సమయంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు స్థానికంగా పనిచేస్తున్న గ్రామాల్లోనే ఉండాలని ‘మా ఊరికి రండి.. మాతోనే ఉండండి’”అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. హుజురాబాద్‌తో పాటు కమలాపూర్, భీమదేవరపల్లి, హుస్నాబాద్​ప్రాంతంలో ప్రవీణ్​కుమార్ ఈ నినాదంపై ప్రత్యేకంగా పలు కార్యక్రమాలు చేపట్టారు. అప్పటికే నక్సలైట్ పార్టీలో పనిచేసిన సానుభూతిపరులను సైతం మా ఊరికి రండి’ కార్యక్రమంలో భాగస్వాములను చేశారు. దీంతో ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు కొంత ఆదరణ ఉంది.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్‌కు చెందిన ప్రవీణ్​కుమార్.. కొతకాలంగా రాజకీయాలపై ఇష్టం చూపిస్తారనే ప్రచారం కూడా జరిగింది. అందుకే స్వేరో స్టార్ పేరుతో ఓ సంస్థకు వెనుక నుంచి నాయకత్వం వహిస్తూ ప్రోత్సహిస్తున్నారని గతంలోనే ఆరోపణలున్నాయి. అయినా కూడా ఆయనపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంతేగాకుండా.. ఐపీఎస్ అధికారి అయినప్పటికీ.. సోషల్ వెల్ఫేర్ గురుకులాల కార్యదర్శి పోస్టును ఏండ్ల నుంచి ఆయనకే పరిమితం చేస్తోంది. మరోవైపు ఆయన భార్య లక్ష్మీబాయి కూడా కన్ఫర్డ్ ఐఏఎస్‌గా రాష్ట్రంలో విధులు నిర్వర్తిస్తున్నారు.

- Advertisement -

ప్రస్తుతం హుజురాబాద్ ​నియోజకవర్గానికి త్వరలోనే ఉప ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆయన్ను అక్కడి నుంచి పోటీకి దింపనున్నారని, అందుకే సీఎం కేసీఆర్ సూచనతోనే ఐపీఎస్‌కు రాజీనామా చేశారనే ప్రచారం జోరందుకుంది. ఒకవేళ ఇప్పుడు టికెట్ ఇవ్వకున్నా.. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు’ బాధ్యతలన్నీ ప్రవీణ్ కుమార్‌కు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో దళిత వర్గాల ఓట్లు పదిలంగా అధికార పార్టీ ఖాతాలోనే ఉంటాయని భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్ రాజీనామా హుజురాబాద్ ఉప ఎన్నికలతో లింక్ ఉన్నట్లేనని అంచనా వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement