Monday, April 29, 2024

తాజ్ మ‌హ‌ల్ ని చూడాలంటే.. కరోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల్సిందే

ఆగ్రాలోని తాజ్ మ‌హ‌ల్ ని సంద‌ర్శించ‌డానికి దేశీయ‌..విదేశాల నుంచి ప‌ర్యాట‌కులు రోజు పెద్ద సంఖ్య‌లో వ‌స్తుంటారు. ఈ పరిస్థితిని దృష్ట్యా అధికారులు క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధానికి చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా తాజ్ మ‌హ‌ల్ ను చూడ‌టానికి వ‌చ్చే వారు వారి సందర్శనకు ముందు కోవిడ్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందని స్ప‌ష్టం చేశారు. క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్న వారికి మాత్ర‌మే అనుమ‌తి ఉంటుంద‌ని తెలిపారు. జిల్లా ఆరోగ్య సమాచార అధికారి (ఆగ్రా) అనిల్ సత్సంగి మాట్లాడుతూ, క‌రోనా వైర‌స్ సంక్రమణ వ్యాప్తిని నివారించడానికి ఆరోగ్య శాఖ ఇప్పటికే పరీక్షలను ప్రారంభించింది.

అప్రమత్తత కొనసాగుతున్నందున, సందర్శకులందరికీ ఇప్పుడు పరీక్షలు తప్పనిసరి చేశారని తెలిపారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నివారణ చర్యలు తీసుకుంటూ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా హెచ్చరిక జారీ చేసింది. అలాగే, కేసులు పెరిగితే సంసిద్ధతను పెంచింది. రాష్ట్రంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్లు, మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్ ఆదేశించారు. మాస్క్ ధరించడం ద్వారా మాత్రమే బయటకు వెళ్లండి- జాగ్రత్త వహించండి. ఆదేశాలను త‌ప్ప‌కుండా పాటించండి’ అని పేర్కొన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ కరోనా వైరస్ కు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం విశ్లేషించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. అలాగే, విదేశాల నుంచి వచ్చేవారిపై నిఘా పెంచుతూ.. విమానాశ్రయంలో చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇన్ఫెక్షన్ ప్రభావిత దేశాల నుంచి తిరిగి వచ్చిన వారిని తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయాల‌ని పేర్కొంది.

ఇన్ఫెక్షన్ ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను తనిఖీ చేయాలని ఉప ముఖ్యమంత్రి అన్నారు. వారి శాంపిళ్ల‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయండని వైద్య వ‌ర్గాల‌కు తెలిపారు. కొత్త కోవిడ్ వేరియంట్లను ఖచ్చితంగా గుర్తించడంలో ఇది సహాయపడుతుంద‌న్నారు. ముఖ్యంగా జలుబు, జ్వరంతో సహా ఇతర లక్షణాలు ఉన్న ప్రయాణీకులను గుర్తించాలని సంబంధిత వర్గాలు తెలిపాయి. కోవిడ్ అనుమానితుల నమూనాలను సేకరించి తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement