Thursday, April 25, 2024

అధికారపక్షం విజయాలే.. ప్రతిపక్షాలకు టార్గెట్.. ప్రధాని మోడీ

అధికారపక్షం ఎంత ఎక్కువ విజయాలు సాధిస్తే అంతగా ప్రతిపక్షాలకు టార్గెట్ అవుతుందని తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ. ఏప్రిల్ 6న పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతికి మధ్య కాలాన్ని సామాజిక న్యాయం కోసం కేటాయించాలని ఎంపీలను కోరారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాలను కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మీడియాతో వెల్లడించారు.ప్రభుత్వ తొమ్మిదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మే 15 నుంచి నెల రోజుల పాటు ఆయా నియోజకవర్గాల్లో వివిధ ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయాలని మోడీ పార్టీ ఎంపీలను కోరారు. భూమాత కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తనను విషపూరితం చేసే రసాయనాల నుంచి విముక్తి కల్పించాలని భూమాత ఏడుస్తోందని అన్నారు. రాజకీయ నాయకులు.. రాజకీయేతర ప్రయోజనాల కోసం పనిచేయాలని, అలాగే వారు సమాజంపై చాలా ప్రభావాన్ని చూపుతారన్నారు.

తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ‘బేటీ బచావో’ (ఆడబిడ్డలను కాపాడండి) కోసం గుజరాత్ ప్రభుత్వం చేసిన కృషిని ఈ సందర్భంగా మోడీ ప్రస్తావించారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవడానికి నిపుణుల సేవలను ఉపయోగించుకోవాలని ఎంపీలను కోరారు. ప్రతిపక్షాల నిరంతర నిరసనలను ప్రస్తావిస్తూ.. బీజేపీ మరిన్ని ఎన్నికలలో విజయం సాధిస్తున్న కొద్దీ ఇలాంటి ఆందోళనలు మరింత తీవ్రమవుతాయని గుజరాత్ ఎన్నికల సమయంలో తాను చెప్పానని మోడీ గుర్తు చేశారు. పార్టీ మరింత తీవ్రమైన, దిగువ స్థాయి దాడులను ఎదుర్కొంటుందన్నారు.ఇటీవల జరిగిన మూడు ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత త్రిపురలో పార్టీ అధికారాన్ని నిలుపుకోగలిగిన తర్వాత జరిగిన తొలి బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఇదే కావడం గమనార్హం. నాగాలాండ్ ఎన్నికల్లోనూ దాని కూటమి విజయం సాధించగా, మేఘాలయలో ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడానికి ఆ పార్టీ మళ్లీ ఎన్పీపీతో చేతులు కలిపింది. కాగా.. పార్టీ సాధించిన ఘనతకు మోడీని ఈ సమావేశంలో ప్రశంసించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement