Thursday, May 16, 2024

పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తిపై టీఎస్‌ రెడ్కో దృష్టి.. విద్యుత్‌ వినియోగం లేని భవన నిర్మాణం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో రెన్యువబుల్‌ ఎనర్జీ (సోలార్‌ పవర్‌) సామర్థ్యం పెంపుపై తెలంగాణ రెన్యూవబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ (టీఎస్‌ రెడ్‌కో) కార్పోరేష్‌ ప్రత్యేక దృష్టి సారించింది. విద్యుత్‌ రంగ కంపెనీలు, ఆర్థిక సంస్థలు, పరికరాల తయారీదారులు, పరిశ్రమలు, ప్రభుత్వ, ప్రయివేట్‌ అధికారులను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు టీఎస్‌ రెడ్కో కృషి చేస్తోంది. థర్మల్‌, జల విద్యుత్‌పైన ఎక్కువగా ఆధారపడకుండా.. సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి, వినియెగంపైన సంస్థలు, పరిశ్రమలు ఎక్కువగా దృష్టి పెట్టేలా టీఎస్‌ రెడ్కో కార్యాచరణపై దృష్టి సారించింది. అందులో భాగంగానే సోమవారం టీఎస్‌ రెడ్కో నేతృత్వంలో కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియనఖ్‌ ఇండస్ట్రీ ( సీఐఐ), బ్యూరో ఆప్‌ ఎనర్జీ ఎఫిసియెన్సీ ( బీఈఈ)ల సహకారంతో ‘ ఇన్వెస్ట్‌మెంట్‌ బజార్‌ ఫర్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ ‘ పేరుతో కార్యక్రమం నిర్వహించింది.

ఈ సమావేశంలో విద్యుత్‌ సామర్థ్యం పెంచేందుకు చేపట్టే ప్రాజెక్టులకు ఆర్థిక సదుయాలపై చర్చించారు. ఈ సందర్భంగా టీఎస్‌ రెడ్కో చైర్మన్‌ వై. సతీష్‌రెడ్డి మాట్లాడుతూ విద్యుత్‌ సామార్థ్య పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా విద్యుత్‌ రంగంలో వేగవంతమైన మార్పు తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడ ఉందన్నారు. భవిష్యత్‌లో వచ్చే విద్యుత్‌ డిమాండ్‌ను తీర్చేందుకు ఇది తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారమని ఆయన వివరించారు. విద్యుత్‌ వినియోగం అవసరం లేని భవనాన్ని 2,591 చదరపు మీటర్ల విస్తీర్ణంలో టీఎస్‌ రెడ్కో నిర్మించబోతుందని చెప్పారు. ఇది మొట్ట మొదటి పర్యావరణ అనుకూల భవనమని సతీష్‌రెడ్డి వివరించారు.

2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు పునరుత్పాదక విద్యుత్‌ సామర్థ్యం రాష్ట్రంలో కేవలం 70 మెగావాట్లు మాత్రమే ఉండేదని, ఇప్పుడు 5,400 మెగావాట్లకు చేరిందని సతీష్‌రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్‌ కృషి, విద్యుత్‌ ఉత్పత్తి, పొదుపులో స్థిరమైన పద్దతుల ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఈ సమావేశంలో బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ జాయింట్‌ డైరెక్టర్‌ శ్యాంసుదర్‌, ఫైనాన్స్‌ ఫవర్‌ కార్పోరేషన్‌ మేనేజర్‌ పీయూష్‌ దత్‌ పాండే, టీఎస్‌ రెడ్కో ఎండీ జానయ్య, ఐఆర్‌ఈడీఏ జీఎం కేపీ ఫిలిప్‌, ఏజీఐ గ్లాస్‌ ఇండస్ట్రీ ఏజీఎం సునిల్‌కుమార్‌ వర్మ, ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీ డీజేపీ వీబీకే ప్రభాకర్‌, సాగర్‌ సిమెంట్‌ వీపీ అంజిరెడ్డి, ఎస్‌ఐడీబీఐ డీజీఎం అభిషేక్‌, స్పింటెక్స్‌ డైరెక్టర్‌ విజయలక్ష్మి, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ అధికారి చంద్రపాల్‌, వొల్టాస్‌ లిమిటెడ్‌ హెడ్‌ రమణిధరణ్‌, గ్రాండ్‌ఫోస్‌ పంప్‌ మేనేజర్‌ పి. గౌతమ్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement