Thursday, May 2, 2024

హైదరాబాద్‌ చుట్టూ మూడు కొత్త టిమ్స్‌ ఆసుపత్రులు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ వ్యాప్తంగా వైద్య సౌకర్యాలను మెరుగుపరచాలన్న లక్ష్యంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో విప్లవాత్మకమైన ముందడుగు వేసింది. తెలంగాణ ఇనిస్ట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ పేరిట… ఎల్బీనగర్‌, అల్వాల్‌, సనత్‌నగర్‌లలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించాలని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ఆదేశించిన విషయంతెలిసిందే. అదే సమయంలో గచ్చిబౌలిలోని టిమ్స్‌ను ఆధునీకరించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించిన మేరకు హైదరాబాద్‌ చుట్టూ ఏర్పాటు చేయనున్న మూడు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి పరిపాలనా ఉత్తర్వులను జారీ చేశారు. ఎల్బీనగర్‌, సనత్‌నగర్‌, ఆల్వాల్‌లోని టిమ్స్‌ ఆసుపత్రులను ఒక్కో ఆసుపత్రిని క్లస్టర్‌ 1 బ్లాక్‌ ఏరియా 10, 53, 800 చదరపు అడుగుల వైశాల్యంలో, క్లస్టర్‌ 2 బ్లాక్‌ ఏరియాను 3, 17, 420 చదరపు అడుగుల వైశాల్యంలో, మొత్తం ప్లింత్‌ ఏరియాను 13, 71, 220 చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించనున్నారు. ఎల్‌బీ నగర్‌ ఆసుపనత్రిని రూ.900 కోట్లతో, సనత్‌నగర్‌ ఆసుపత్రిని రూ.882 కోట్లతో, అల్వాల్‌ లో నిర్మించబోయే టిమ్స్‌ ను రూ.897 కోట్లతో నిర్మించాలని అంచనా వేశారు. ఆమేరకు గురువారం మూడు ఆసుపత్రులకు కలిపి 2679 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ అంచనాలను ఆమోదించిన ప్రభుత్వం ఆ మేరకు నిధులు విడుదల చేసింది. నూతనంగా నిర్మించనున్న 3టిమ్స్‌ ఆసుపత్రుల నిర్మాణాన్ని ఆర్‌అండ్‌బీ శాఖ చేపట్టనుంది. ఇందుకు సంబంధించిన ప్రాథమిక డిజైన్లను వెంటనే సమర్పించాలని ఆదేశాల్లో ఈఎన్‌సీకి నిర్దేశించారు. ఈ విషయంలో తదుపరి చర్యలను తీసుకునే అధికారాన్ని టీఎస్‌ఎంఐడీసీ ఎండీతోపాటు రాష్ట్ర వైద్య విద్య విభాగం అధిపతి డా. రమేష్‌రెడ్డికి కల్పించారు.

గాంధీ, నిమ్స్‌, ఉస్మానియాలపై తగ్గనున్న ఒత్తిడి..

నగర శివార్లలో నలు దిక్కులా నాలుగు సూపర్‌ స్పెషాల్టి ఆస్పత్రులు నిర్మాణం అయితే పెద్ద సంఖ్యలో రోగులకు వైద్య సేవలు అందిస్తోన్న గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌ లపై ఒత్తిడి తగ్గనుంది. గచ్చిబౌలి, అల్వాల్‌, సనత్‌ నగర్‌, ఎల్బీనగర్‌లలో నిర్మించే ఈ ఆస్పత్రుల నిర్మాణం వల్ల జిల్లాల నుంచి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యం అందించవచ్చు. అల్వాల్‌లో ఏర్పాటు చేసే ఆసుపత్రికి సంగారెడ్డి, సిద్దిపేట, ఆదిలాబాద్‌ జిల్లాల నుంచి వచ్చే రోగులు చక్కటి వైద్యం పొందే అవకాశం ఉంది. ఎల్బీనగర్‌ టిమ్స్‌ ఆస్పత్రికి.. ఖమ్మం, నల్గొండ, సూర్యపేట జిల్లాల నుంచి వచ్చే రోగులు వైద్యం పొందే వీలుంది. అదే రీతిలో గచ్చిబౌలి, సనత్‌ నగర్‌ ఆస్పత్రులకు వచ్చే రోగులకు కూడా నాణ్యమైన వైద్య సేవలు అందనున్నాయి. గతంలో ఏదైనా అత్యవసర వైద్య సేవలు కావాలంటే నిమ్స్‌ కో, గాంధీకో తరలించాల్సిన పరిస్థితి ఉండేది. ట్రాఫిక్‌ కారణంగా అందాల్సిన వైద్యం సకాలంలో అందక రోగులు చనిపోయిన సందర్బాలు ఉన్నాయి. నగరం నలుదిక్కులా సూపర్‌ స్పెషాల్టి ఆసుపత్రుల నిర్మాణం పూర్తయితే జిల్లాల నుంచి అత్యవసర వైద్య సాయం కావాల్సిన రోగులకు ట్రాఫిక్‌ బెడద లేకుండా నగర శివార్లలోనే అత్యుత్తమ, అత్యవసర వైద్య సేవలు అందించే అవకాశం కలుగుతోంది. దీంతో పాటు గాంధీ, నిమ్స్‌, ఉస్మానియా ఆసుపత్రులకు రోగుల ఒత్తిడి తగ్గుతుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement