Monday, April 29, 2024

ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కి చేరిన మూడో విమానం – భార‌త్ కి బుడాపెస్ట్ నుంచి మ‌రో విమానం

ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భార‌తీయుల‌తో కూడిన మూడో విమానం కూడా స్వ‌దేశానికి చేరుకుంది. హంగేరియ‌న్ రాజ‌ధాని బుడాపెస్ట్ నుంచి బ‌య‌లుదేరిన ఎయిర్ ఇండియా ప్ర‌త్యేక విమానం ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కి చేరుకుంది. ఈ విమానంలో మొత్తం 240 మంది ఇండియన్స్ ఉన్నారు. భారతీయుల తరలింపులో భాగంగా బుడాపెస్ట్ నుంచి భారత్‌కు చేరిన తొలి విమానం ఇది. దీంతో ఉక్రెయిన్‌పై ..రష్యా యుద్దం మొదలైన తర్వాత భారత్ స్వదేశానికి తరలించిన భారతీయుల సంఖ్య 709కి చేరింది. ఇప్పటికే కొందరు ఎంబసీ అధికారుల సూచనలతో ఉక్రెయిన్ సరిహద్దుల వైపున‌కు వస్తున్నారు. అయితే ఇంకా వేలాది మంది ఉక్రెయిన్‌లోనే ఉన్నారు. వారి తరలింపు ప్రక్రియను భారత విదేశాంగ శాఖ ముమ్మరం చేసింది. క్రెయిన్‌లో ఉన్న భారతీయులు తమ పాస్‌పోర్ట్‌లు, నగదు (ప్రాధాన్యంగా US డాలర్లలో), ఇతర అవసరమైన వస్తువులు, COVID-19 వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌లను వారి వెంట ఉంచుకోవాలని రాయబార కార్యాలయం సూచించింది. బుడాపెస్ట్‌ నుంచి మరో విమానం భారత్‌కు బయలుదేరింది. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ వెల్లడించారు. ఉక్రెయిన్ నుంచి బుడాపెస్ట్‌కు చేరుకున్న భారతీయులతో ఎయిర్ ఇండియా విమానం భారత్‌కు బయలుదేరిందని తెలిపారు. 198 భారతీయులు ఈ విమానంలో స్వదేశానికి వస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement