Monday, April 29, 2024

Congress | ఎవరితోనూ పొత్తు ఉండదు.. అదంతా కోమటిరెడ్డి సొంత అభిప్రాయం: మాణిక్‌రావు ఠాక్రే

తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీతో, బీఆర్​ఎస్​ పొత్తు పెట్టుకోక తప్పదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్​రావు ఠాక్రే స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి ఎవరితోనూ పొత్తుపెట్టుకునే ఉద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు. శంషాబాద్ ఎయిర్​పోర్ట్​ బయట మీడియాతో మాట్లాడారు. కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని మాణిక్​రావు ఠాక్రే అభిప్రాయపడ్డారు.

వరంగల్​ బహిరంగ సభలో రాహుల్ గాంధీ చెప్పిన మాటలకే పార్టీ కట్టుబడి ఉందని ఠాక్రే అన్నారు. కోమటిరెడ్డి ఏం మాట్లాడారో తాను ఇంకా చూడలేదన్నారు. వ్యాఖ్యలు చేసిన వీడియోలు చూసి.. ఆ తర్వాత మాట్లాడతానన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీతో బీఆర్​ఎస్​ పొత్తు పెట్టుకుంటుందని కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తున్నామని చెప్పారు.

ఠాక్రేను కలిసిన కోమటిరెడ్డి..
మరోవైపు శంషాబాద్ విమానాశ్రయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్ రావు ఠాక్రేతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న కోమటిరెడ్డి ఎయిర్ పోర్టు లాంజీలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శులు నదీమ్‌ జావీద్‌, బోసురాజు, హర్కర్ వేణుగోపాల్‌ తదితరులున్నారు.

- Advertisement -

తప్పుపడుతున్న కాంగ్రెస్ శ్రేణులు..
కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి పొత్తులపై మాట్లాడిన తీరును కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా తప్పుపట్టాయి. రాష్ట్రంలో హంగ్ ఏర్పాటు కావడం వల్ల బీఆర్​ఎస్​.. కాంగ్రెస్​తో పొత్తు ఉంటుందని చేసిన వ్యాఖ్యలపై దుమారమే చెలరేగుతోంది. ఇప్పటికే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, సీనియర్ లీడర్​, ఉపాధ్యక్షుడు మల్లు రవి, పీసీసీ ఉపాధ్యక్షుడు సామల కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్​.. కోమటిరెడ్డి వ్యాఖ్యలకు బదులిచ్చారు.

కాంగ్రెస్ పార్టీ ఏ ఎన్నికల్లో అయినా ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఎవరితో పొత్తు ఉండబోదని వరంగల్ వేదికగా రాహుల్ గాంధీ స్పష్టం చేశారని, ఇప్పుడు కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి చేసిన వ్యాఖ్యలు కేడర్​లో, పార్టీ శ్రేణుల్లో, కార్యకర్తల్లో గందరగోళం కలిగించేలా ఉన్నాయని పీసీసీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంకట్​రెడ్డి వ్యాఖ్యలతో.. పార్టీకి ఎటువంటి సంబంధం లేదని అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement