Thursday, April 25, 2024

Vemula : రాష్ట్రంలో కొనసాగుతున్న సమీకృత అభివృద్ధి.. మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో సమీకృత అభివృద్ధి కొనసాగుతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా వేములలో ఎస్‌జీడీ ఫార్మా కార్నింగ్‌ టెక్నాలజీ ప్లాంట్‌ నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయని చెప్పారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని వెల్లడించారు. కరంటు, తాగు, సాగునీళ్లు ఇవ్వనోళ్లు మళ్లీ ఓట్ల కోసం వస్తున్నారని విమర్శించారు. లైఫ్‌సైన్స్‌ రంగంలో తెలంగాణ అగ్రగామిగా ఉందని చెప్పారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి నాయకత్వంలో దేవరకద్ర నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతున్నదని తెలిపారు.

రాష్ట్రంలోనే అత్యధిక చెక్‌డ్యాంలు నిర్మించిన నియోజకవర్గం దేవరకద్ర అని చెప్పారు. దేవరకద్రలో రెండు ప్రభుత్వ దవాఖానల నిర్మాణం చేపడుతామన్నారు. గత ప్రభుత్వాల హయాంలో దేవరకద్ర నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మంత్రి కేటీఆర్‌ కృషితోనే తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతున్నదని చెప్పారు. అంతకుముందు భూత్పూర్‌లో మున్సిపల్‌ పార్కు, ఓపెన్‌ జిమ్‌లను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement