Sunday, April 28, 2024

Telangana: భయపెడుతున్న టైఫాయిడ్​ మహమ్మారి, ఒక్క నెలలోనే 2,752 కేసులు!

తెలంగాణ ప్రజలను టైఫాయిడ్​ వణికిస్తోంది. ఈ జులై 12 రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 2,752 టైఫాయిడ్​ కేసులు నమోదయ్యాయి. ఇంకా చాలామంది ఆస్పత్రులకు రాకుండా సొంత వైద్యం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. దీనికంతటికీ పరిశుభ్రత లేని ఆహారం, రోడ్డు సైడ్​ ఫుడ్​ తినడమే అంటున్నారు వైద్య, ఆరోగ్య నిపుణులు. అయితే.. పరిశుభ్రత పాటించని, రోడ్డుపక్కన వ్యాపారులు విక్రయించే పానీపూరి తినడం వల్లనే ఎక్కువ మంది అస్వస్థతకు గురవుతున్నారని తెలంగాణ ప్రజారోగ్య శాఖ (డీహెచ్​) డైరెక్టర్​ జి. శ్రీనివాసరావు అన్నారు. అందువల్లే రాష్ట్రంలో టైఫాయిడ్​ కేసులు పెరుగుతున్నాయని తెలిపారు.

మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీహెచ్‌ మాట్లాడుతూ.. వర్షాకాలంలో ప్రజలు రోడ్​ సైడ్​ ఫుడ్​ అస్సలు తినకూడదని కోరారు. ఈ ఒక్క జులై నెలలోనే రాష్ట్రంలో 2,752 టైఫాయిడ్‌ కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పారు.  బాగా మరిగించిన నీటితోనే పానీ పూరీ తయారు చేయాలని విక్రయదారులను ఆయన కోరారు.

ప్రస్తుతం భారీ వర్షాలతో వరదలు, కొట్టుకొస్తున్న చెత్తా, చెదారంతో రోడ్డు సైడ్​ పరిసరాలు శుభ్రంగా ఉండవు. ఈగలు, దోమల బెడద కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకని ఈగలు, దోమలు వాలకుండా రోడ్​సైడ్​ ఫుడ్​ అమ్మేవాళ్లు జాగ్రత్తలు తీసుకోవాలని డీహెచ్​ సూచించారు. 

పానీ పూరీ తింటే కేవలం పది రూపాయలు అవుతుందని, దానివల్ల వచ్చే జబ్బుతో ఆస్పత్రి పాలు కావడం వల్ల అటు ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా.. దాదాపు 10వేలకు పైగా డబ్బులు ఖర్చుపెట్టుకోవాల్సి వస్తుందని డీహెచ్​ హెచ్చరించారు. అందుకని పది రూపాయల పానీ పూరి కోసం హెల్త్​ పాడుచేసుకోవద్దని సూచించారు. ఇక.. ప్రైవేటు  ఆస్పత్రులు అనవసరమైన ల్యాబ్ పరీక్షలను రాస్తే.. పట్టించుకోవద్దని, అట్లాంటి వారి నుంచి కూడా జాగ్రత్తగా ఉండాలని కోరారు. టైఫాయిడ్, కలరా, మలేరియా వంటి సీజనల్​ సంబంధిత వ్యాధులతో ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా చూసుకోవాలని డీహెచ్​ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement