తెలంగాణ ప్రజలను టైఫాయిడ్ వణికిస్తోంది. ఈ జులై 12 రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 2,752 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి. ఇంకా చాలామంది ఆస్పత్రులకు రాకుండా సొంత వైద్యం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. దీనికంతటికీ పరిశుభ్రత లేని ఆహారం, రోడ్డు సైడ్ ఫుడ్ తినడమే అంటున్నారు వైద్య, ఆరోగ్య నిపుణులు. అయితే.. పరిశుభ్రత పాటించని, రోడ్డుపక్కన వ్యాపారులు విక్రయించే పానీపూరి తినడం వల్లనే ఎక్కువ మంది అస్వస్థతకు గురవుతున్నారని తెలంగాణ ప్రజారోగ్య శాఖ (డీహెచ్) డైరెక్టర్ జి. శ్రీనివాసరావు అన్నారు. అందువల్లే రాష్ట్రంలో టైఫాయిడ్ కేసులు పెరుగుతున్నాయని తెలిపారు.
మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీహెచ్ మాట్లాడుతూ.. వర్షాకాలంలో ప్రజలు రోడ్ సైడ్ ఫుడ్ అస్సలు తినకూడదని కోరారు. ఈ ఒక్క జులై నెలలోనే రాష్ట్రంలో 2,752 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పారు. బాగా మరిగించిన నీటితోనే పానీ పూరీ తయారు చేయాలని విక్రయదారులను ఆయన కోరారు.
ప్రస్తుతం భారీ వర్షాలతో వరదలు, కొట్టుకొస్తున్న చెత్తా, చెదారంతో రోడ్డు సైడ్ పరిసరాలు శుభ్రంగా ఉండవు. ఈగలు, దోమల బెడద కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకని ఈగలు, దోమలు వాలకుండా రోడ్సైడ్ ఫుడ్ అమ్మేవాళ్లు జాగ్రత్తలు తీసుకోవాలని డీహెచ్ సూచించారు.
పానీ పూరీ తింటే కేవలం పది రూపాయలు అవుతుందని, దానివల్ల వచ్చే జబ్బుతో ఆస్పత్రి పాలు కావడం వల్ల అటు ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా.. దాదాపు 10వేలకు పైగా డబ్బులు ఖర్చుపెట్టుకోవాల్సి వస్తుందని డీహెచ్ హెచ్చరించారు. అందుకని పది రూపాయల పానీ పూరి కోసం హెల్త్ పాడుచేసుకోవద్దని సూచించారు. ఇక.. ప్రైవేటు ఆస్పత్రులు అనవసరమైన ల్యాబ్ పరీక్షలను రాస్తే.. పట్టించుకోవద్దని, అట్లాంటి వారి నుంచి కూడా జాగ్రత్తగా ఉండాలని కోరారు. టైఫాయిడ్, కలరా, మలేరియా వంటి సీజనల్ సంబంధిత వ్యాధులతో ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా చూసుకోవాలని డీహెచ్ చెప్పారు.