Thursday, May 2, 2024

Festival | తెలంగాణ ద‌శాబ్ది ఉత్స‌వాల లోగో.. ఆవిష్క‌రించిన సీఎం కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలను సంబురంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రత్యేక రాష్ట్ర సాధన నుంచి నేటి వరకు పదేండ్లకు చేరుకున్న రాష్ట్ర‌ ప్రగతి ప్రస్థానం, అస్తిత్వాన్ని ప్రతిబింబించేలా ప్రభుత్వం లోగోను సిద్ధం చేసింది. ఈ లోగోను డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్‌ సచివాలయంలో సీఎం కేసీఆర్ ఇవ్వాల (సోమవారం) రాత్రి ఆవిష్కరించారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్తు, వ్యవసాయం, మిషన్ భగీరథ, సాంస్కృతిక, యాదాద్రి వంటి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలు, మెట్రో రైలు, టీ-హబ్, డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ సచివాలయం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం చిహ్నాలను ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు లోగోలో పొందుపరిచారు.

ఇక‌.. తెలంగాణ తల్లి, బతుకమ్మ, బోనాలు, పాలపిట్ట, అమరవీరుల స్మారకంతో కూడిన తెలంగాణ అస్తిత్వ చిహ్నాలతో తెలంగాణ ఖ్యాతి మరింత ఇనుమడించేలా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల లోగో రూపుదిద్దుకుంది. కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్ రెడ్డి, బాల్క సుమన్, సీఎం ప్రధాన సలహాదారు సోమేశ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ శాంతి కుమారి, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement