Thursday, March 28, 2024

రేపు త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్‌తో ముఖ్య‌మంత్రి కేసీఆర్ భేటీ..

త‌మిళ‌నాడు ప‌ర్య‌ట‌న‌లో ఉన్న తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మంగ‌ళ‌వారం ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్‌తో స‌మావేశం కానున్న‌ట్లు తెలుస్తోంది. రేపు తిరుత్త‌ణిలో ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అనంత‌రం ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు స‌మావేశం అయ్యే అవ‌కాశం ఉంది. ఈ భేటీ స్టాలిన్ నివాసంలో సాయంత్రం 4 నుంచి 5 గంట‌ల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ రోజు రాత్రికి త‌మిళ‌నాడులోని ఐటీసీ హోట‌ల్‌లో సీఎం కేసీఆర్ బ‌స చేయ‌నున్నారు.

త‌మిళ‌నాడు తిరుచిరాప‌ల్లి జిల్లా శ్రీరంగంలోని రంగ‌నాథ‌స్వామి ఆల‌యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి స్వామి వారికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. రంగ‌నాథ‌స్వామిని ద‌ర్శించుకున్న సీఎం కేసీఆర్ మొక్కులు చెల్లించుకున్నారు. వేద మంత్రాల‌తో రంగ‌నాథ స్వామి ఆల‌య పండితులు సీఎం కేసీఆర్ కు పూర్ణ‌కుంభంతో ఆహ్వానం ప‌లికారు. సీఎం కేసీఆర్‌తో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యులు గ‌జ‌రాజు నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. అంత‌కుముందు తిరుచ్చి క‌లెక్ట‌ర్ శ్రీనివాసు, త‌మిళ‌నాడు మంత్రి అరుణ్ నెహ్రూ కేసీఆర్‌కు స్వాగతం ప‌లికి ఆల‌యంలోకి తీసుకెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement