Saturday, April 27, 2024

తప్పు మంత్రి వర్గానిది.. శిక్ష అధికారులకా?

ఆర్థికశాఖలోని సమాచారం లీక్ చేస్తున్నారన్న అభియోగంపై ముగ్గురు ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం వేటు వేయడాన్ని టీడీపీ తీవ్రంగా తప్పుబట్టింది. రాష్ట్ర ప్రభుత్వ నిధులకు మంత్రివర్గం ట్రస్టీలే గాని యజమానులు కాదని టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల అన్నారు. మంత్రివర్గం అవినీతి, దుబారా చేస్తున్నందునే సమాచారాన్ని రాజ్యాంగ సంస్థలకు తెలియకుండా తొక్కిపెట్టారని మండిపడ్డారు. అసెంబ్లీకి, కాగ్, కేంద్ర ఆర్థిక సంస్థలకు తెలియకుండా ఎందుకు దాచారు? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలపై అక్రమ కేసులతో, అధికారులు, ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ వారి దోపిడీ నుండి ప్రజల దృష్టి మళ్లిస్తున్నారని మండిపడ్డారు. సెక్రటేరియేట్ ఉద్యోగులపై చర్యలు కూడా ఈ కోవలోనివేనని చెప్పారు. తప్పులు మంత్రివర్గానివి, శిక్షలు అధికారులకు, ఉద్యోగులకా?  అని ప్రశ్నించారు.

ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి సమాచారం ప్రజలకు తెలియాల్సిందేనన్న ఉద్దేశ్యంతో టీడీపీ ప్రభుత్వం అన్నింటినీ డిజిటలైజ్ చేసి పబ్లిక్ డొమైన్ లో ఉంచిందని చెప్పారు.  కాగ్ నివేదిక, అసెంబ్లీలో పెట్టే ఎఫ్ఆర్బీఎం రిపోర్టులు, బడ్జెట్ ఎక్స్ పెండిచర్, సీఎఫ్ఎంఎస్ ఇవన్నీ ప్రజలకు అందుబాటులో ఉండేవని గుర్తు చేశారు. అలాంటి సమాచారాన్ని పనిగట్టుకుని లీక్ చేయాల్సిన అవసరం లేదని హితవు పలికారు. మంత్రివర్గం చేసిన తప్పిదాలకు అధికారుల, ఉద్యోగులను బాద్యులను  చేసి శిక్ష వేయడాన్ని అన్ని వర్గాలు ఖండిస్తున్నాయని పేర్కొన్నారు. అప్పుల సంక్షోభానికి మంత్రివర్గ అవినీతి, దుబారాలే  ప్రధాన కారణమని యనమల ఆరోపించారు.  

తెలుగుదేశం ప్రభుత్వం ఏడాదికి సరాసరిన రూ.26 వేల కోట్లు అప్పు చేయగా, వైసీపీ ప్రభుత్వం ఏడాదికి బడ్జెట్ అప్పులే సరాసరిన రూ.50 వేల కోట్లు చేసిందని దుయ్యబట్టారు. 2019- -20లో 57 రోజులు ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్లారని పేర్కొన్నారు. స్పెషల్ విత్ డ్రాల కోసం 37 రోజులు, వేతనాల కోసం 128 రోజులు.. మొత్తంగా ఏడాదిలో 221 రోజులు అప్పులకు వెళ్లారని వివరించారు. ఏడాదిలో రూ.60,371 కోట్ల అప్పులు చేశారని చెప్పారు. రెండేళ్లలో సగటు ఆర్ధిక లోటు 4.8%, ద్రవ్యలోటు 4.8%, రెవెన్యూ లోటు 3.1%, అప్పులు 33.7% చొప్పున ఉన్నాయని అన్నారు. ఇవన్నీ ఎఫ్ఆర్బీఎం పరిమితులకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. స్టేట్ సెక్యురిటీలపై తీసుకునే అప్పులకు ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుందని చాలా రాష్ట్రాలు వెనక్కుపోయాయని విమర్శించారు. దాదాపు 7 శాతం వడ్డీగా చెల్లించాల్సి వస్తుందని 14 రాష్ట్రాలు అప్పులు తీసుకోవడం మానేస్తే ఏపీ మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయకుండా.. అప్పులపై అప్పులు చేస్తోందని యనమల మండిపడ్డారు.

- Advertisement -

గత ఏడాది రూ.12,000 కోట్లు రుణం సేకరించిన కర్నాటక ఈ ఏడాది ఎక్కువ వడ్డీ చెల్లించాల్సిన అప్పుల జోలికి అసలు వెళ్లలేదని గుర్తు చేశారు. కానీ, అప్పుల ఊబిలో చిక్కుకుని క్లాసిక్ డెట్ లోకి వెళ్లిపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అప్పులు చేయడానికి ఏమాత్రం వెనుకాడటం లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement