Saturday, April 20, 2024

మిశ్రమంగా ముగిసిన స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ షేర్లు ..

న్యూఢిల్లీ : రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు దృఢంగా నమోదవ్వడం దేశీయ ఈక్విటీ మార్కెట్లకు ఊపునిచ్చింది. మదుపర్ల సెంటిమెంట్‌ సానుకూలమవ్వడంతో బుధవారం దేశీయ సూచీలు లాభాల్లో దూసుకెళ్లాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 620 పాయింట్లు లాభపడి 57,685 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 50సూచీ 184 పాయింట్లు వృద్ధి చెంది 17,167 పాయింట్ల వద్ద ముగిసింది. కాగా ఇంట్రాడేలో సెన్సెక్స్‌ గరిష్ఠంగా 782 పాయింట్లు మేర లాభపడగా.. నిఫ్టీ కీలకమైన 17,200 మార్క్‌ను తాకింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ అత్యధికంగా లాభపడ్డాయి. ఎన్‌ఎస్‌ ఈపై 15 రంగాల్లో 12 సూచీలు లాభాల్లోనే ముగిశాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ సూచీ దాదాపు 3 శాతం వరకు వృద్ధి చెందింది. నిఫ్టీ బ్యాంక్‌, ఆటో, ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌, ఐటీ, మీడియా, మెటల్‌, ప్రైవేటు బ్యాంక్‌, రియల్టిd, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు కూడా 1- 2.3 శాతం మేర పెరిగాయి.

మరోవైపు నిఫ్టీ ఫార్మా, హెల్త్‌కేర్‌, కన్స్యూమర్‌ డ్యురబుల్‌ సూచీలు నష్టాలతో ముగిశాయి. మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లు మిశ్రమంగా ముగిశాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 100 సూచీ 1 శాతం వృద్ధి చెందగా.. నిఫ్టీ స్మాల్‌ క్యాప్‌ 100 సూచీ ఫ్లాట్‌గా ముగిసింది. నిఫ్టీపై ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా మోటార్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, మారుతీ సుజుకీ, హిందాల్కో, టెక్‌ మహింద్రా షేర్లు 3- 5 శాతం మధ్య లాభపడ్డాయి. మరోవైపు సిప్లా, దివీస్‌ ల్యాబ్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఇండియన్‌ ఆయిల్‌, సన్‌ ఫార్మా, టాటా కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌, టైటాన్‌, కోటక్‌ మహింద్రా బ్యాంక్‌ నష్టపోయిన స్టాకుల జాబితాలో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement