Friday, March 29, 2024

Breaking: బావిలోకి దూసుకెళ్లిన కారు.. సహాయక చర్యల్లోనూ విషాదం

దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్‌ వద్ద కారు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లిన ఘటనలో మరో విషాదం చోటు చేసుకుంది. వెలికితీసిన కారులో ఇద్దరి మృతదేహాలు లభ్యం కాగా.. కారును బావి నుంచి బయటకు తీసేందుకు సహాయ చర్యల్లో పాల్గొన్న గజఈతగాడు కూడా మృతి చెందాడు. ఇవాళ మధ్యాహ్నం దుబ్బాక మండలం చిట్టాపూర్‌ వద్ద టైరు పేలడంతో కారు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. దాదాపు 5 గంటల నుంచి కారును బావి నుంచి వెలికితీసేందకు సహాయక చర్యలు కొనసాగాయి. గజఈతగాళ్ల సాయంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కారును తీసేందకు ప్రయత్నించారు.

రెండు మోటార్ల సాయంతో బావిలోని నీటిని ఖాళీ చేసేందుకు ప్రయత్నించారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఘటనా స్థలికి చేరుకొని సహాయ చర్యలను పరిశీలించారు. బావిలో నుంచి కారును తీసేందుకు గజఈతగాళ్లు తీవ్రంగా శ్రమించారు. మోటార్ల సాయంతో బావిలోని నీరు కొంత మేర తీసేసిన అనంతరం బావి లోపల ఉన్న కారుకు గజఈతగాడు నర్సింహులు తాడును బిగించాడు. తాడు బిగించిన అనంతరం పైకి వచ్చే క్రమంలో కారుకు చిక్కుకుపోయి నర్సింహులు నీటిలోనే మృతిచెందాడు. మరోవైపు బావిలోకి దూసుకెళ్లిన కారులో తల్లీకుమారుడి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. నీటిలో పడి మృతి చెందిన తల్లీకుమారుడు ఎక్కడివారు అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement