Friday, April 26, 2024

ప్రయాణికులకు గమనిక: పట్టాలెక్కిన పలు రైళ్లు

ఏపీకి వెళ్లాలని భావిస్తున్న రైలు ప్రయాణికులకు శుభ వార్త. కరోనా ఉద్ధృతి, లాక్ డౌన్ కారణంగా అతి తక్కువ సర్వీసులను నడిపిస్తున్న దక్షిణమధ్య రైల్వే.. క్రమంగా సర్వీసులు పెంచుతోంది. ప్రస్తతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రైళ్లను పునరుద్ధరించారు. తాజాగా కాచిగూడ-రేపల్లె మధ్య నడిచే డెల్టా ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-కర్నూలు మధ్య నడిచే తుంగభద్ర ఎక్స్‌ప్రెస్, గుంటూరు-కాచిగూడ-గుంటూరు మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇవాళ్టి నుంచి తిరిగి అందుబాటులోకి రానున్నాయి.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో రైల్వే అధికారులు వీటిని రద్దు చేశారు. అయితే ఇప్పుడు ఆంక్షలు సడలిస్తుండడంతో తిరిగి వీటిని పట్టాలెక్కించారు. ఇక, హైదరాబాద్-చెన్నై మధ్య నడిచే ప్రత్యేక రైలును నేటి నుంచి ఈ నెల 30 వరకు రద్దు చేసినట్టు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. దీంతోపాటు తిరుపతి-చెన్నై సెంట్రల్ మధ్య నడిచే రైలును నేటి నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రద్దు చేస్తున్నట్టు తెలిపింది.

కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌ దేశంపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను విధించారు. ఈ క్రమంలో రైల్వేలపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో సరైన ఆక్సుపెన్సీ లేని కారణంగా రాజధాని, దురంతో, శతాబ్ది తదితర సూపర్‌ ఫాస్ట్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లతో పాటు ప్యాసింజర్ రైళ్లు రద్దయ్యాయి. ప్రస్తుతం కొంత కేసులు తగ్గుముఖం పడుతుండడంతో పాటు ఆంక్షలు సడలిస్తున్న నేపథ్యంలో రైల్వేశాఖ మళ్లీ రైళ్లను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఇటివల ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే పరిధిలో 24 రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement