Thursday, April 25, 2024

TS | దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలే.. ప్రారంభోత్సవ కార్యక్రమంపై సీఎస్​ సమీక్ష

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమ నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇవ్వాల ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. డాక్టర్​ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రారంభం తర్వాత.. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నందున అత్యంత వైభవంగా, పండగ వాతావరణంలో జరుపుకునేలా కృషి చేయాలని వివిధ శాఖల అధికారులను సీఎస్​ ఆదేశించారు.

కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సచివాలయ, జీహెచ్ఎంసీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నందున సచివాలయంలోకి వారి ప్రవేశం, వాహనాల పార్కింగ్, భద్రతా ఏర్పాట్లను చేపట్టాలని పోలీస్ అధికారులకు సూచించారు. సెర్మోనియల్ పరేడ్ నిర్వహణ, జాతీయ పతాకావిష్కరణ ఏర్పాట్లను చేపట్టాలని అన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశమున్నందున వారికి సరిపడా షామియానాలు, సీటింగ్, తదితర ఏర్పాట్లు చేయాలని రోడ్లు, భవనాల శాఖ అధికారులను ఆదేశించారు. బీ.ఆర్. అంబేద్కర్ సెక్రెటేరియట్ తోపాటు రాజభవన్, అసెంబ్లీ ఇతర ప్రముఖ భవనాలను విధ్యుత్ దీపాలతో అలంకరించాలని కోరారు.

జీహెచ్ఎంసీ సమన్వయంతో గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపానికి ఫ్లోరల్ డెకరేషన్ చేపట్టాలని కోరారు. సమావేశ ప్రాంగణంలో ఎల్ఈడీ స్క్రీన్ ల ఏర్పాటు, పీ.ఏ. సిస్టం తదితర ఏర్పాట్లను చేపట్టాలని సమాచార, పౌర సంబంధాల స్పెషల్ కమీషనర్ ను ఆదేశించారు. నగరంలోని చార్మినార్, క్లాక్ టవర్ తదితర ప్రముఖ భవనాలను ఉత్సవాలు జరిగే 21 రోజులపాటు విధ్యుత్ దీపాలతో అలంకరించాలని మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షకు ఈ సమావేశానికి డీజీపీ అంజనీ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అర్వింద్ కుమార్, సునీల్ శర్మ, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ.ఆనంద్​తో సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement