Monday, April 29, 2024

Shah Tour: జ‌మ్మూ క‌శ్మీర్‌లో.. త్రీ డేస్ అమిత్‌షా టూర్‌

Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు జ‌మ్ముక‌శ్మీర్‌లో ప‌ర్యటించ‌నున్నారు. జ‌మ్ముక‌శ్మీర్‌కు ప్రత్యేక స్వయంప్రతిప‌త్తి క‌ల్పించే 370 అధిక‌ర‌ణాన్ని ర‌ద్దు చేసిన త‌ర్వాత కేంద్ర పాలిత ప్రాంతమైన జ‌మ్ముక‌శ్మీర్‌లో షా ఫ‌స్ట్ టైమ్‌ ప‌ర్యటించ‌నున్నారు. కేంద్ర హోం మంత్రి రానుండ‌డంతో రాజ్‌భ‌వ‌న్ నుంచి క‌శ్మీర్ లోయ‌లో 20 కిలోమీటర్ల విస్తీర్ణంలో ప‌టిష్ఠ భ‌ద్రతా ఏర్పాట్లు చేశారు. గుప్కర్ రోడ్డులోని రాజ్‌భ‌వ‌న్‌లో అమిత్ షా బ‌స చేయ‌నున్నారు.

స్థానికేత‌రులు, మైనారిటీలపై ఈ మ‌ధ్య కాలంలో పెరిగిన దాడుల నేప‌థ్యంలో క‌శ్మీర్ లోయను భ‌ద్రతా బ‌ల‌గాలు త‌మ ఆధీనంలోకి తీసుకున్నాయి. కీల‌క ప్రాంతాల్లో స్నైప్పర్స్‌, షార్ప్ షూట‌ర్లను మోహ‌రింప‌జేశారు.

జ‌మ్ముకశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ బ‌ల‌గాలు సంయుక్తంగా భ‌ద్రతా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఉగ్రవాద దాడుల‌ను నియంత్రించేందుకు శ్రీ‌న‌గ‌ర్‌లోని సిటీ సెంట‌ర్ నుంచి లాల్ చౌక్ దాకా గ‌గ‌న‌త‌లంపైనా నిఘా పెట్టారు. ప్రజ‌ల్లో అనుమానాస్పద క‌ద‌లిక‌ల‌ను క‌నిపెట్టడానికి శ్రీన‌గ‌ర్ అంత‌టా డ్రోన్లతో ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

డాల్ లేక్‌, జీలం న‌దుల్లో మోటారు బోట్ల‌ను సీఆర్పీఎఫ్ బ‌ల‌గాలు క్షుణ్ణంగా త‌నిఖీ చేస్తున్నాయి. ఉగ్రవాదుల క‌ద‌లిక‌ల‌ను క‌నిపెట్టేందుకు శ్రీ‌న‌గ‌ర్ అంత‌టా భ‌ద్రతా అధికారులు మ‌ఫ్టీలో డ్యూటీలో ఉన్నారు. ఎక్కడిక‌క్కడ వాహ‌నాల త‌నిఖీలు, పాద‌చారుల త‌నిఖీలు చేప‌ట్టారు. ఇందుకోసం ఢిల్లీ నుంచి వ‌చ్చిన 10 సీఆర్పీఎఫ్ కంపెనీలు, 15 బీఎస్ఎఫ్ టీమ్స్ శ్రీన‌గ‌ర్‌లో భ‌ద్రతా విధులు నిర్వ‌ర్తిస్తున్నాయి.

హోంమంత్రి అమిత్‌షా త‌న ప‌ర్యట‌న‌లో శ్రీ‌న‌గ‌ర్‌-షార్జా మ‌ధ్య విమాన స‌ర్వీసును ప్రారంభించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. అలాగే ఇటీవ‌ల జ‌రిగిన దాడుల్లో చ‌నిపోయిన‌ పౌరుల కుటుంబాల‌తోనూ అమిత్‌షా భేటీ కానున్న‌ట్టు స‌మాచారం. ఆయ‌న అధ్యక్షత‌న జ‌రిగే యునిఫైడ్ క‌మాండ్ స‌మావేశంలో జ‌మ్ముక‌శ్మీర్‌లో భ‌ద్రతా ప‌రిస్థితుల‌పై స‌మీక్షించ‌నున్నారు. ఆదివారం జ‌మ్ములో జ‌న్ సంవాద్ అనే పేరుతో జ‌రిగే బ‌హిరంగ స‌భ‌లో అమిత్‌షా ప్ర‌సంగించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement