Sunday, April 28, 2024

రెండో దశ దంగల్ షురూ!

బెంగాల్, అసోంలో.. రెండో విడత పోలింగ్​ ప్రారంభమైంది. ఓటు వేసేందుకు ఇప్పటికే పలు కేంద్రాల్లో ప్రజలు బారులు తీరారు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్​.. సాయంత్రం 6 గంటల వరకు సాగనుంది. కొవిడ్​ నిబంధనలు- పటిష్ఠ భద్రతా ఏర్పాట్ల మధ్య రెండో దశ పోలింగ్​ సాగనుంది. ఇందుకోసం అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు.

బెంగాల్ లోని నందిగ్రామ్​ నియోజకవర్గంలో పోలింగ్​ కేంద్రంలో అధికారులు.. ఏర్పాట్లను ముమ్మరం చేశారు. బెంగాల్, అసోంలోని పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు ఇప్పటికే ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎదురుచూస్తున్నారు. అసోంలో 39, బెంగాల్ లో 30 అసెంబ్లీ స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.

అసోంలో మొత్తం 126 నియోజకవర్గాలు ఉండగా మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. 47 స్థానాలకు గత నెల 27న తొలివిడత ఓటింగ్ జరిగింది. బెంగాల్ లో లో 8 విడతల సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలి దశలో 30 స్థానాల్లో పోలింగ్ గత నెల 27న జరగింది. తాజాగా జరగనున్న పోలింగ్​లో అందరి దృష్టి నందిగ్రామ్​ నియోజకవర్గంపైనే ఉంది. సీఎం మమతా బెనర్జీ- బిజెపి నేత సువేందు అధికారి ఈ నియోజకవర్గం నుంచి బరిలో దిగడం ఇందుకు కారణం.

నందిగ్రామ్​వాసులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్​ కేంద్రాలకు తరలివెళుతున్నారు. పోలింగ్​ మొదలైన కాసేపటికే.. పోలింగ్​ కేంద్రాల వద్ద బారులుతీరారు ఓటర్లు. యువకుల నుంచి వృద్ధుల వరకు క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నందిగ్రామ్​ నుంచి బరిలో దిగిన నాటి మిత్రులు-నేటి శత్రువులు మమతా బెనర్జీ-సువేందు అధికారి పోరులో ప్రజలు ఎవరిని గెలిపిస్తారనేది సర్వత్రా ఆసక్తిగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement