Friday, May 3, 2024

Save Congress | బయటివారికే పదవులా?..  హైకమాండ్​ తీరుపై భగ్గుమంటున్న సీనియర్లు

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒకదాని తర్వాత మరో సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ‘అసలు కాంగ్రెస్’ తామే అని పేర్కొంటూ కొత్త వివాదానికి తెరదీశారు. పార్టీని ‘బయటి వ్యక్తులు’ చేజిక్కించుకుంటున్నారని, తాము అనుమతించబోమని అంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సీనియర్లంతా ఒక విధమైన తిరుగుబాటు లేవనెత్తుతున్నారు. అయితే.. ఇక్కడ రేవంత్​రెడ్డి పేరు ప్రస్తావనకు తీసుకురాకుండానే ఆయనను బయటి వ్యక్తిగా అభివర్ణిస్తున్నారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

కాంగ్రెస్​ హైకమాండ్​ ఈ మధ్య ప్రకటించిన పలు పార్టీ పదవుల్లో తమకు సముచిత న్యాయం దక్కలేదని పార్టీకి చెందిన కొంతమంది సీనియర్​ లీడర్లు మనస్తాపానికి గురయ్యారు. అందులో వరంగల్​ జిల్లాకు చెందిన సీనియర్​ లీడర్​ కొండా సురేఖ బాహాటంగా తనకు అప్పగించిన పదవికి రాజీనామా చేశారు. ఇక ఆ తర్వాత పలువురు లీడర్లు ఒక్కొక్కరుగా తెరమీదకు వస్తూ తమకు సరైన అవకాశాలు ఇవ్వడం లేదని ఆరోపణలకు దిగుతున్నారు.

ఇక.. ఇవ్వాల (శనివారం) హైదరాబాద్​లో రెండు గంటలపాటు జరిగిన భేటీలో కొత్త కమిటీలో కాంగ్రెసోళ్లకు జరిగిన ‘అన్యాయం’పై పరిశీలించామని సీనియర్ నేత, సీఎల్పీ లీడర్​ భట్టి విక్రమార్క అన్నారు. ఈ ప్రక్రియలో తన ప్రమేయం లేదని, తన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు. ‘సేవ్ కాంగ్రెస్’ ప్రచార నినాదంతో ముందుకు సాగాలని ఇవ్వాల జరిగిన సమావేశంలో సీనియర్​ లీడర్లంతా తీర్మానించినట్టు ఆయన తెలిపారు. సీనియర్ నేతలను కించపరిచేలా, వారి పాత్రను హతమార్చేందుకు సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోందని, దీనిని ఖండిస్తున్నట్టు చెప్పారు. కాగా, ప్రకటించిన 108 స్థానాల్లో 54 స్థానాలు టీడీపీ నుంచి వచ్చిన వారికే దక్కాయని మరో ముఖ్య నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్​ పార్టీని కాపాడుకునేందుకు యత్నిస్తుంటే వారిని కోవర్టులు అని ఎలా అంటారని మరో సీనియర్​ నేత, ఎమ్మెల్యే జగ్గా రెడ్డి ప్రశ్నించారు. పీసీసీ, ఏఐసీసీ ఇన్‌చార్జిలు తమపై సోషల్ మీడియా దాడిని ఖండించలేదని మండిపడ్డారు. “నాలుగు పార్టీలు మారిన వారు కాంగ్రెస్​లోకి వచ్చి తాము ఎలా పనిచేయాలో చెప్పలేరని మరో నేత రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక.. ఇంకో సీనియర్​ లీడర్​ అయిన మధు యాస్కీ ఈ పోరాటాన్ని ‘నిజమైన కాంగ్రెస్‌మెన్ Vs బయటి వ్యక్తులు’గా అభివర్ణించారు.

- Advertisement -

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ‘భారత్ జోడో యాత్ర’ పాదయాత్ర చేస్తున్న తరుణంలో తెలంగాణలో పార్టీలో చిచ్చురేగి విభజనకు దారితీయడం వంటి ఘటనలు జరుగున్నాయి. గత నెలలో తెలంగాణలో రాహుల్​ పాదయాత్ర చేస్తున్నప్పుడు సీనియర్ నేతలంతా కలిసి పాల్గొన్నారు. కానీ, అంతలోనే ఇట్లా జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement