Thursday, May 9, 2024

స‌మ‌తామూర్తి విగ్ర‌హం త‌యారీలో – ఎన్నో ప్ర‌త్యేక‌త‌లు

శ్రీరామ‌న‌గ‌రంలోని స‌మ‌తాస్ఫూర్తి కేంద్రంలో ప్ర‌తిష్టించిన రామానుజాచార్య విగ్ర‌హావిష్క‌ర‌ణ నేడు ప్ర‌ధాని మోడీ చేతుల మీదుగా జ‌ర‌గ‌నుంది. కాగా ఈ విగ్ర‌హంలో ఎన్నో ప్ర‌త్యేక‌తలు ఉన్నాయి. 2013లో ప్రారంభ‌మైన ఈ ఆలోచ‌న‌ని 2014లో విగ్ర‌హం రూపంలో నిర్మాణాన్ని ప్రారంభించారు. రామానుజాచార్యుల శ్రీమూర్తి 14 రకాల నమూనాలను చినజీయర్‌స్వామి తయారు చేయించారు. అందులో మూడింటిని ఎంపిక చేసి, వాటిలో బాగా వచ్చిన రూపురేఖలను మిళితం చేసి, మరో నమూనా తయారు చేశారు. కాగా ఈ విగ్రహం పూర్తిగా పంచలోహాలతో తయారైంది. ఇందులో 83 శాతం రాగి వినియోగించగా.. వెండి, బంగారం, జింక్‌, టైటానియం లోహాలను వినియోగించి తయారు చేశారు. సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణకు శ్రీరామనగరం సుందరంగా ముస్తాబవుతోంది. ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా శనివారం… సమతామూర్తి విగ్రహాన్ని లోకార్పణం చేయనున్నారు. బెంగళూరులో 3డీ స్కానింగ్‌ చేయించారు. దాంతో ఆబ్జెక్టు ఫైల్‌ తయారు చేయించారు.

దాన్ని తీసుకువచ్చి ప్రత్యేకంగా వర్క్‌స్టేషన్‌ తీసుకుని మాయ, మడ్‌బ్రష్‌ సాఫ్ట్‌వేర్లు వినియోగించి మరింత సుందరంగా మలిచారు. యజ్ఞోపవీతం, శిఖ, గోళ్లు, వేళ్లు, వస్త్రం వంటి సూక్ష్మ అంశాలు కూడా జాగ్రత్తగా తీర్చిదిద్దారు. ప్రధాన స్థపతి ఆధ్వర్యంలో దాదాపు 22 రోజులపాటు నిత్యం 18 నుంచి 19 గంటలపాటు శ్రమించారు. చినజీయర్‌స్వామి రోజూ రెండు, మూడు గంటలు కేటాయించి సంప్రదాయ, శాస్త్ర, కొలతలకు సంబంధించిన సూచనలిస్తూ, సాఫ్ట్‌వేర్‌ ఫైల్‌ తయారు చేయించారు. సాఫ్ట్‌వేర్‌ ఫైల్‌ను చైనాలోని ఏరోసెన్‌ కార్పొరేషన్‌కు పంపి, క్యాస్టింగ్‌, అసెంబ్లింగ్‌ పనులు అప్పగించారు. రోబోటిక్‌ పరిజ్ఞానం వినియోగం ప్రత్యేక యంత్రం సాయంతో రోబోటిక్‌ పరిజ్ఞానం వినియోగించి థర్మోకోల్‌తో 1:10 మోడల్‌ (సుమారు 16 నుంచి 17 అడుగుల ఎత్తు)లో నమూనా విగ్రహం తయారు చేయించారు. చినజీయర్‌స్వామి చైనా వెళ్లి దాన్ని పరిశీలించి సవరణలు చెప్పారు. తర్వాత మరిన్ని సవరణలతో మరో సాఫ్ట్‌వేర్‌ ఫైల్‌ను చైనా పంపించారు. మరోసారి థర్మోకోల్‌ను 1:1 మోడల్‌గా కత్తిరించి 20 అడుగుల విగ్రహం తయారు చేశారు. ప్రధాన స్థపతి బృందం వెళ్లి సవరణలు చేసి క్యాస్టింగ్‌కు అనుమతించారు. అలా 1600 ముక్కలుగా తయారు చేసి.. తీసుకువచ్చి.. అప్పటికే ముచ్చింతల్‌లో తయారైన స్టీల్‌ నిర్మాణంపై లేయర్ల వారీగా అతికించారు. ఏరోసెన్‌ కార్పొరేషన్‌కు చెందిన 70 మంది నిపుణుల బృందం వచ్చి విగ్రహానికి రూపునిచ్చింది. ఈ ప్రక్రియకు 15 నెలలు పట్టింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement