Wednesday, April 24, 2024

ఢిల్లీపై దండయాత్ర చేస్తానన్న కేసీఆర్ కు ఏమైంది?: రేవంత్

ధాన్యం విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై టీ.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యానించారు. గత వారం రోజులుగా టీఆర్ఎస్ ఎంపీలు నాటకాలు ఆడారని అన్నారు. నిన్న తాను చెప్పిన విధంగానే నేడు టీఆర్ఎస్ ఎంపీలు అదే పని చేశారన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు బైకాట్ చేస్తారని తాను ముందే చెప్పానని గుర్తు చేశారు. మోడీ, కేసీఆర్ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారమే వాళ్ళు వాకౌట్ చేశారని ఆరోపించారు. ఢిల్లీపైన దండయాత్ర చేస్తానన్న సీఎం కేసీఆర్.. అగ్గిపుట్టిస్తానని  కాళీ చేతులతో వెళ్ళారని అన్నారు. ఫామ్ హౌస్ లో పెగ్గు తాగి పడుకున్నారని విమర్శించారు.

గత రెండు నెలల నుంచి రైతులు రాష్ట్రంలో అష్టకష్టాలు పడుతున్నారన్న రేవంత్.. రోజు 4, 5 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటలో ఏమి చేశారో ఇప్పటివరకు చెప్పలేదన్నారు. తెలంగాణలో వరి సమస్య తీరిందా? అని ప్రశ్నించారు. కేంద్రం ఏమైనా నిర్ణయం తీసుకుందా హామీ ఇచ్చిందా? అని నిలదీశారు.  ఎందుకు శీతాకాల సమావేశాలు ఎంపీలు వాకౌట్ చేశారని ప్రశ్నించారు. ఢిల్లీ నుంచి గల్లీకి ఎందుకు వెళ్తున్నారని రేవంత్ అడిగారు. శీతాకాల సమావేశాల్లో ఢిల్లీ మెడలు వంచుతాం అని ఇప్పుడు గల్లీ బాట పట్టారని ఎద్దేవా చేశారు. చనిపోయిన రైతు కుటుంబాలకు రూ. 25 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని ప్రతిపక్షాలు పార్లమెంటులో డిమాండ్ చేసినట్లు చెప్పారు. ప్రతిపక్షాలు వాయిస్ పక్కదోవ పట్టించేందుకు టీఆర్ఎస్ ఎంపీలు పోడియం చుట్టూ ఆందోళన చేశారని మండిపడ్డారు. ఈడిలకు, బిడిలకు భయపడను అని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు ఎందుకు కేంద్రానికి భయపడుతున్నారని నిలదీశారు.

హైదరాబాదు శివార్లలో మూడు వేల కోట్ల విలువైన భూముల విషయంలో కేసీఆర్ సన్నిహితులకు ఈడీ నోటీసులు ఇచ్చిందని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 15 సంవత్సరాల క్రితం విదేశీ కంపెనీలకు 450 కోట్లకు ఈ భూములను అప్పట్లో నాటి ప్రభుత్వం కట్టబెట్టిందన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారి నుంచి బలవంతంగా 350 కోట్లకు కొనుగోలు చేశారని ఆరోపించారు. హైదరాబాద్ కు చెందిన పెద్ద రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్, టివి యజమానికి ఈ భూములు కట్టబెట్టారని ఆరోపించారు. ఈడి కేసులను నుంచి తప్పించుకునేందుకే కేసీఆర్ పార్లమెంట్ లో ఎంపీలను ఆందోళన చేయమని చెప్పారని పేర్కొన్నారు.

భూముల వ్యవహారంలో కేటీఆర్ ని ఈడి పిలిపించాలని భావించిందని, అయితే, చివరి నిమిషంలో వాయిదా పడిందన్నారు. భూముల అక్రమాలలో మంత్రి కేటీఆర్ సంతకం చేశారన్న రేవంత్ రెడ్డి.. బిజెపి, కేటీఆర్ పై కేసులు తాత్కాలికంగా వాయిదా వేయడం వల్లనే పార్లమెంట్ ని వాకౌట్ చేశారన్నారు. టిఆర్ఎస్ నాయకులు రాష్ట్రంలో ఎక్కడ కనిపించినా కోడిగుడ్లు, రాళ్లు, కర్రలతో కొట్టాలని రేవంత్ పిలపునిచ్చారు. నిజాం వారసుల కంటే కేసీఆర్ వారసులు శ్రీమంతులు అయ్యారని రేవంత్ ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement