Monday, April 29, 2024

Exclusive | టీడీపీ పాత కాపులపై రేవంత్​ గురి.. కాంగ్రెస్​లోకి రావాలని ఆహ్వానాలు!

మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ఇంటికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లిన‌ట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయనను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన‌ట్టు స‌మాచారం. కాగా, రేపో, ఎల్లుండో మండవ వెంకటేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరతారని పొలిటిక‌ల్ స‌ర్కిళ్ల‌లో ప్రచారం జరుగుతోంది. ఆయన గనుక కాంగ్రెస్‌లో చేరితే నిజామాబాద్ రూరల్ టికెట్ ఇస్తార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా వ‌రంగ‌ల్ జిల్లా న‌ర్సంపేట‌లో మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన‌ట్టు స‌మాచారం. కాగా, ప‌ర‌కాల టికెట్ ను రేవూరి ఆశిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అయితే.. ఈ ఇద్దరు నేతలు కూడా ప్రస్తుతం క్రియాశీల రాజకీయాల్లో కొనసాగడం లేదన్నది స్పష్టమవుతోంది.

– వెబ్​ డెస్క్​, ఆంధ్రప్రభ

టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న మండవ వెంకటేశ్వరరావు 2019 ఉగాది పర్వదినాన సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. నిజామాబాద్‌ జిల్లాలో కీలక నేతగా ఉన్న మండవ డిచ్‌పల్లి, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల నుంచి అప్ప‌ట్లో తెలుగుదేశం అభ్యర్ధిగా పోటీ చేసి పలుమార్లు గెలుపొందారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు.

2009 నుంచి మండవ వెంకటేశ్వరరావు ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉంటున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని భావించినా, పొత్తులో భాగంగా ఆ టికెట్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. దీంతో ఆయన రాజకీయాలకు దూరం అయిన‌ట్టు తెలుస్తోంది. అదే ఏడాది తెలంగాణ సీఎం కేసీఆర్ జూబ్లీహిల్స్ లోని మండవ వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లి సుమారు గంటన్నరపాటు చర్చించారు. అనంతరం పార్టీలోకి రావాల‌ని ఆహ్వానించారు. కేసీఆర్ తో భేటీ అనంతరం మండవ వెంకటేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీలో చేరతానని ప్ర‌క‌టించి, 24 గంటలలోపే కారెక్క‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

- Advertisement -

ఇక.. రేవూరి ప్రకాశ్​రెడ్డి 2019లో బీజేపీలో చేరారు. అప్పట్లో పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో మరో నేత రవీంద్రనాయక్​తో కలిసి రేవూరి కాషాయ కండువా కప్పుకున్నారు. కానీ, ఆ తర్వాత అటు బీజేపీలో యాక్టీవ్​గానూ లేరు. క్రియాశీల రాజకీయాలకు కూడా దూరంగా ఉంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement