Thursday, April 25, 2024

పొంగులేటికి రాజ్య‌స‌భ ఆఫ‌ర్‌.. మంత్రి కేటీఆర్ భేటీతో సందిగ్ధంలో శ్రీనివాస్​రెడ్డి!

ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్​ఎస్​ సీనియర్​ లీడర్​ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి చాలా కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. అయితే జిల్లాలో నెలకొన్న పరిస్థితుల్లోనే ఆయన స్తబ్ధుగా ఉన్నట్టు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. కాగా, ఇవ్వాల మంత్రి, పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ అయిన కేటీఆర్​ ఆయనను పిలిచి బిగ్​ ఆఫర్​ ఇచ్చినట్టు తెలుస్తోంది. రాజ్యసభకు వెళ్లాల్సిందిగా కేటీఆ​తో జరిగిన భేటీలో చెప్పినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ విషయమై శ్రీనివాస్​రెడ్డి ఇంకా ఏం తేల్చుకోలేదని సమాచారం. కాగా, బండ ప్రకాశ్​ రాజ్యసభకు రాజీనామా చేయగా.. ఆ ప్లేస్​ ఖాళీగా ఉంది.. దీంతో ఆ స్థానంలో పొంగులేటికి చాన్స్​ ఇస్తున్నట్టు ఇంకొంత మంది చెబుతున్నారు. దీంతో మూడేళ్ల పదవీ కాలం మాత్రమే దక్కే అవకాశం ఉంటుంది. అందుకని మూడేళ్ల పదవినా? లేక ఎన్నిక‌ల్లో పోటీకి దిగ‌డ‌మా అనే మీమాంస‌లో శ్రీనివాస్​రెడ్డి ఉన్న‌ట్టు తెలుస్తోంది.

కాగా, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ టిక్కెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా తాను పోటీ చేస్తానని గ‌తంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన అనుయాయులతో చెప్పిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. పార్టీ అధిష్టానం తనకు న్యాయం చేస్తుందనే న‌మ్మకం ఉంద‌ని చెబుతూనే.. ఒకవేళ తనకు టిక్కెట్ ఇవ్వకపోతే ఎంపీ లేదా ఎమ్మెల్యేగా జిల్లాలోని ఏదోక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించిన విష‌యాన్ని ఇప్పుడు పార్టీ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి.

‘ప్రస్తుతం గులాబీ తోటలోనే ప్రయాణం చేస్తున్నా.. ముళ్లు గుచ్చుకుంటున్నా బాధ అనిపించడం లేదు.. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున టికెట్‌ ఇచ్చినా, ఇవ్వకపోయినా ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల తీర్పు కోరతా’ అని శ్రీనివాసరెడ్డి ఆ మ‌ధ్య అన్న విష‌యాన్ని ప్ర‌స్తుతం పార్టీ లీడ‌ర్లు తెర‌మీదికి తెస్తున్నారు. అంతేకాకుండా ఢిల్లీలోని కాంగ్రెస్, బీజేపీ అధినాయకత్వాలు తనతో తరుచూ సంప్రదింపులు జరుపుతున్నాయని కూడా ఆ మ‌ధ్య శ్రీనివాసరెడ్డి బాహాటంగానే పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement