Thursday, April 25, 2024

Bharat Jodo: ఉత్తరాదికి చేరిన యాత్ర.. జ్యోతిర్లింగాలను దర్శించుకోనున్న రాహుల్​ గాంధీ

కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ చేపట్టిన “భారత్ జోడో యాత్ర” నవంబర్ 20వ తేదీ నాటికి మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోకి చేరనుంది. ఇప్పటికే కేరళ, తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ, మహారాష్ట్రలో రాహుల్​ పాదయాత్ర ముగిసింది. అయితే.. యాత్ర ఉత్తరాదికి చేరుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని రాహుల్​ గాంధీ పలు దేవాలయాలను దర్శించుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. రాహుల్ గాంధీ ఖాండ్వాలోని ఓంకారేశ్వర్, ఉజ్జయిని మహాకాళేశ్వర్ వంటి రెండు జ్యోతిర్లింగ ఆలయాలను సందర్శించనున్నారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

భారత్ జోడో యాత్ర తీరుపై కాంగ్రెస్​ పార్టీ హై కమాండ్​ సమీక్ష చేసింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సహా కాంగ్రెస్ టాప్​ లెవల్​ లీడర్లు దేశ రాజధానిలో భేటీ అయ్యారు. యాత్ర ఉత్తర భారతదేశంలోకి ప్రవేశిస్తున్నందున పార్టీ కొత్త వ్యూహాన్ని అమలు చేయాలని వారుఈ సమావేశంలో నిర్ణయించినట్టు తెలుస్తోంది. రాహుల్ గాంధీ, ఇతర సీనియర్ నాయకులు నవంబర్ 25 న ఓంకారేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని సందర్శించేందుకు ప్లాన్​ చేస్తున్నారు.

ఇక.. రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో రాబిన్‌హుడ్ ఆఫ్ ఇండియా అని కూడా పిలిచే తాంతియా మామా జన్మస్థలాన్ని సందర్శించనున్నట్టు సమాచారం. ఖాండ్వాలోని ఓంకారేశ్వర్ మహాదేవ్‌ను దర్శించుకోవడంతో పాటు, రాహుల్ గాంధీ నవంబర్ 25న నిమాడ్‌లోని తాంతియా మామా జన్మస్థలమైన పంధానా తహసీల్‌కు చెందిన బడోడా గ్రామాన్ని సందర్శించనున్నారు. కాంగ్రెస్ నవంబర్ 30, డిసెంబర్ 1 మధ్య ఉజ్జయినిలో మెగా ర్యాలీకోసం ప్లాన్ చేస్తోంది. రాహుల్ గాంధీ మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించడమే కాకుండా, ఉజ్జయినిలో మెగా బహిరంగ సభను నిర్వహించేందుకు కూడా పార్టీ సన్నద్ధమవుతోంది. నవంబర్ 28 లేదా 29న రాహుల్ గాంధీ ఇండోర్‌లో మీడియా మీట్​పెట్టే అవకాశం ఉంది.

అట్లనే.. భారత్ జోడో యాత్ర నవంబర్ 20న బుర్హాన్‌పూర్‌లోకి ప్రవేశిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ తరపున ప్రచారం చేయడానికి రాహుల్ గాంధీ నవంబర్ 21న గుజరాత్‌లో పర్యటించాల్సి ఉన్నందున.. యాత్ర నవంబర్ 23 నుండి తిరిగి ప్రారంభమవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఖాండ్వా మీదుగా ఇండోర్, ఉజ్జయిని వరకు ఈ యాత్ర వెళ్లనుంది. అదేవిధంగా భారత్ జోడో యాత్ర డిసెంబర్ 5వ తేదీన రాజస్థాన్‌లోకి ప్రవేశించనున్నట్టు సమాచారం.

- Advertisement -

ఇక.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల భవితవ్యాన్ని నిర్ణయించే నిమాడ్-మాల్వా బెల్ట్ నుంచి భారత్ జోడో యాత్ర సాగుతుందని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలు తెలిపారు. రాజస్థాన్‌లో 22 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, ఇవి ప్రధానంగా షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు) కోసం రిజర్వ్ అయ్యాయి. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రదేశ్ కమిటీకి భారత్ జోడో యాత్ర సహాయం చేస్తుందని మధ్యప్రదేశ్ సీనియర్ నేత తెలిపారు. భారత్ జోడో యాత్ర డిసెంబర్ 5న రాజస్థాన్‌లోకి ప్రవేశించడానికి దాదాపు 15 రోజుల ముందు మధ్యప్రదేశ్‌లో పాదయాత్ర కొనసాగుతుందని, దీన్ని తాము ప్రచారానికి ఉపయోగించుకుంటామని పార్టీ నేతలు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement