Monday, April 29, 2024

ఐదు నెలల విరామానికి బ్రేక్… పెట్రోలుపై 91 పైసలు,డీజిల్ పై 88 పైసలు పెంపు

దాదాపు ఐదు నెలల తర్వాత పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 88 పైసలు పెంచుతున్నట్లు డీలర్లకు సమాచారం అందించాయి. హైదరాబాద్‌లో మంగళవారం ఉదయం ఆరుగంటల నుంచి పెరిగిన ధరలు అమలులోకి వచ్చాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా ఇటీవల అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు గరిష్టానికి చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే రోజురోజుకు చమురు సంస్థల నష్టాలు పెరుగుతుండడంతో పెట్రోలు, డీజిల్‌ ధరలను పెంచడం అనివార్యంగా మారినట్లు అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరికొన్ని రోజుల పాటు చమురు ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కొన్ని నెలలకు ముందు భారత్‌లో చమురు ధరలు గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై రూ. 10, డీజిల్‌పై రూ. 5 చొప్పున ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించింది. కేంద్ర ప్రభుత్వాన్ని అనుసరించి పలు రాష్ట్రాలు సైతం వ్యాట్‌ను తగ్గించడంతో వినియోగదారులకు భారీ ఊరట లభించింది. తెలుగు రాష్ట్రాలు మాత్రం వ్యాట్‌ను తగ్గించని విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.108.20 ఉండగా, డీజిల్‌ ధర రూ. 94. 62గా ఉంది. పెంచిన ధరలతో పెట్రోలు ధర రూ.109.10, డీజిల్‌ 95.49కు చేరనుంది. పెరిగిన ధరలతో సామాన్య ప్రజల ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వంట నునె సహా నిత్యావసర సరుకుల ధరలు ఆశాకాన్ని అంటాయి. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరగడంతో ఆవేదన చెందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement