Monday, April 29, 2024

Counter Attack | జాతీయస్థాయిలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. మోదీకి కేటీఆర్​ స్ట్రాంగ్​ కౌంటర్​!

మార్పు కోరుకుంటుంది తెలంగాణ ప్రజలు కాదు.. జాతీయ స్థాయిలో అధికార మార్పు రావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు ట్విట్టర్‌ వేదికగా మంత్రి కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు. నమో అంటే నమ్మించి మోసం చేయడమని తెలంగాణ ప్రజలకు తెలుసునన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ స్టీరింగ్‌ కేసీఆర్‌ చేతుల్లో పదిలంగానే ఉందని.. కానీ బీజేపీ స్టీరింగ్ అదాని చేతిలోకి వెళ్లిపోయిందంటూ కేటీఆర్​ సెటైర్లు వేశారు. కేంద్రం కిసాన్ సమ్మాన్‌ కింద ఇచ్చింది కేవలం నామమాత్రం కానీ.. ఒక చిన్న రాష్ట్రమైన తెలంగాణ కొత్త రాష్ట్రమైనప్పటికీ 70 లక్షల మంది రైతులకు 72 వేల కోట్లను నేరుగా ఖాతాల్లో వేసిన విషయం తెలుసుకుంటే మంచిదని మోదీకి సూచించారు.

– వెబ్​ డెస్క్​, ఆంధ్రప్రభ

రైతుల రుణమాఫీ జరగనే లేదని మాట్లాడటం మిలియన్ డాలర్ జోక్ అన్నారు. స్వతంత్ర భారత చరిత్రలోనే ఒక కొత్త రాష్ట్రం రెండుసార్లు రైతుల రుణమాఫీకి నడుం బిగించిందని, అది కూడా ఏకైక సందర్భమని.. తెలంగాణలోనే ఆవిష్కృతమైందన్నారు. అన్నదాత అప్పులు మాఫీ చేసిన జైకిసాన్ ప్రభుత్వం మాదని.. కార్పొరేట్ దోస్తులకు 14.5 లక్షల కోట్ల రుణాలు రద్దు చేసిన నై కిసాన్ సర్కారు మీది అంటూ విమర్శించారు. కర్షకుల రక్తం కండ్ల జూసిన రైతుహంతక రాజ్యం బీజేపీదని, పదేళ్లపాటు విభజన హామీలను పాతరేసి.. ఎన్నికల హామీలను గాలికి వదిలేసి ఓట్ల వేటలో ఇప్పుడొచ్చి మాట్లాడితే నమ్మేదేవరని చురకలంటించారు.

ప్రాజెక్టులతో చుక్క నీరు రాలేదనడం మోదీ అవివేకానికి నిదర్శనమన్నారు. తెలంగాణలో సాగుతోంది సాగునీటి విప్లవం సాగుతుందని, తెలంగాణ రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేక చేతులెత్తేసిన మీరా మాట్లాడేది? అంటూ నిలదీశారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనమంటే నూకలు తినమన్న కేంద్ర పెద్దల అవమానకర మాటలు తెలంగాణ రైతులు మరిచిపోలేదన్నారు. మీరు ఎన్ని చెప్పినా.. బీజేపీకి తెలంగాణలో నూకలు చెల్లిపోయాయన్నారు. నిన్న కాళేశ్వరం అయినా.. నేడు పాలమూరు ప్రాజెక్టు అయినా.. ప్రపంచ సాగునీటి చరిత్రలోనే అతి గొప్ప మానవ నిర్మిత అద్భుతాలన్నారు. భవిష్యత్తు ఇరిగేషన్ రంగానికే సరికొత్త పాఠాలని, వీటిపై ప్రధాని ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement