చైనాలో రోజు రోజుకి కరోనా విజృంభిస్తోంది. ఈ క్రమంలో జనవరి 11 నాటికి చైనా వ్యాప్తంగా 90 కోట్ల మందికి కరోనా సోకినట్లు పెకింగ్ యూనివర్సిటీ అధ్యయనంలో తాజాగా వెల్లడైంది. 141 కోట్ల డ్రాగన్ దేశ జనాభాలో ఇది సుమారు 64 శాతం. అత్యధికంగా గాన్సు ప్రావిన్స్ లో 91 శాతం మంది ప్రజలు వైరస్ బారిన పడినట్లు అధ్యయనంలో వెల్లడైంది. ప్రావిన్స్ తర్వాత యూనాన్ ప్రాంతంలో 84 శాతం, కింఘై లో 80 శాతం మంది ప్రజలు వైరస్ బారిన పడినట్లు పేర్కొంది. కాగా, చైనా వ్యాప్తంగా మరో 2-3 నెలల వరకు కొవిడ్ గరిష్ఠ స్థాయిలో ఉంటుందని అంటువ్యాధుల నిపుణులు అంచనా వేశారు.
ఇది గ్రామీణ ప్రాంతాలకు కూడా వ్యాపించే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం డ్రాగన్ న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతోంది. ఈ నెల 22వ తేదీన చైనీయులు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నారు. గత మూడేళ్లుగా కొవిడ్ నిబంధనల మధ్య మగ్గిన చైనీయులు.. వేడుకలకు దూరంగా ఉన్నారు. ఇటీవల చైనా ప్రభుత్వం జీరో కొవిడ్ విధానాన్ని ఎత్తివేయడంతో కోట్లాది మంది సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే రెండు, మూడు నెలలు కేసులు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేశారు.