Friday, April 26, 2024

Flash: ఎంజీఎంలో ఎలుకల దాడిలో గాయపడిన రోగి మృతి

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎలుకల దాడిలో తీవ్రంగా గాయపడిన కడార్ల శ్రీనివాస్ మృతి చెందాడు. హనుమకొండ జిల్లా భీమారానికి చెందిన శ్రీనివాస్ తీవ్ర అనారోగ్య సమస్యలతో ఎంజీఎం ఆసుపత్రిలో చేరాడు. అక్కడాయనను ఐసీయూలో ఉంచి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో గదిలోని ఎలుకలు శ్రీనివాస్‌పై దాడిచేసి శరీరాన్ని కొరికేశాయి. స్పర్శ కోల్పోయిన ఆయన ఈ విషయం తెలుసుకోలేకపోయాడు. దీంతో తీవ్ర రక్తస్రావమైంది.  రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర సంచలనమైంది. ఈ ఘటనను తీవ్రంగా స్పందించిన రాష్ట్రప్రభుత్వం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు, ఇద్దరు డ్యూటీ డాక్టర్లపై చర్యలు తీసుకుంది. ఎలుకల దాడిలో గాయపడిన శ్రీనివాస్‌ను మంత్రి హరీశ్‌రావు ఆదేశంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పరిస్థితి విషమించడంతో నిన్న రాత్రి శ్రీనివాస్ మృతి చెందాడు.

గత వారం రోజుల క్రితం శ్రీనివాస్‌ కిడ్నీ సంబంధిత వ్యాధితో వరంగల్‌లోని ఎంజీఎంలో చేరాడు. ఉత్తర తెలంగాణకే అతిపెద్ద ఆసుపత్రిగా పేరున్న ఎంజీఎంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఐసీయూలో ట్రీట్‌మెంట్ పొందుతున్న శ్రీనివాస్‌ని ఎలుకలు కొరుక్కుతిన్నాయి. ఇన్‌పేషెంట్‌గా ఉన్న శ్రీనివాస్‌ని ఐదు రోజుల వ్యవధిలోనే రెండుసార్లు ఎలుకలు దాడి చేశాయి. రోగి అచేతన స్థితిలో ఉండటంతో ఎలుకలు మొదటిసారి చేతి వేళ్లు కొరకాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement